ఎమ్మెల్యే ఇంటిపై దాడి: బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక, బట్టలూడదీస్తారంటూ చింతల కౌంటర్
వరంగల్: పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏమాత్రం చోటు లేదని ఆదవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ విషయం బీజేపీ గుర్తుంచుకోవాలంటూ కేటీఆర్..
ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపంచాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాలన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని ఆరోపించారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏమాత్రం వాంఛనీయం కాదని కేటీఆర్ హితవు పలికారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు కూడా ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు.
బయట తిరగలేరంటూ బీజేపీ మంత్రి కేటీఆర్ వార్నింగ్
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉందని, తమ ఓపికకి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించినట్లు చెప్పారు. అయినా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నామని అన్నారు. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే, అయోధ రామ మందిర నిర్మాణ నిధులపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రామ మందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. రాముడు అందరివాడని, హిందువైనా ప్రతివారు రాముని పూజిస్తారని, రామమందిర నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి బీజేపీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్రం ఏపీకి ఎందుకు అప్పగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్రం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా? అని ప్రశ్నించారు.
Recommended Video
బట్టలూడదీస్తారంటూ చింతల రామచంద్రారెడ్డి కౌంటర్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాఖ్యల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 56 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రాముడిపై, రామ మందిర నిర్మాణంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తోందన్నారు. చల్ల ధర్మారెడ్డి పిచ్చికూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. రామభక్తులు బట్టలూడదీస్తారంటూ హెచ్చరించారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ దేశంలో అందరికీ తెలిసినా.. ఆ ఎమ్మెల్యేకు తెలియదా? అని నిలదీశారు.
ఇది ఇలావుండగా, ఆదివారం సాంయత్రం వరంగల్ బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్, వాహనాలు, ధ్వంసం చేశారు.