సెక్షన్ 8పై ఆటార్నీ జనరల్ స్పష్టత, గాలి వార్తలేనన్న టీఆర్ఎస్ ఎంపీ
హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్కు 'అధికారాలు-బాధ్యత'లపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టత ఇచ్చారు.
ఉమ్మడి రాజధానిలో గవర్నర్కి ఉన్న అధికారులు:
* హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాబట్టి, నగరంపై ఇరు రాష్ట్రాల పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది.
* సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు'లో దర్యాప్తును గవర్నర్ స్వయంగా పర్యవేక్షించొచ్చు.
* విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు ప్రత్యేక అధికారులు.
* ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్దే.
సెక్షన్ 8పై అటార్నీ జనరల్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో, కేంద్రం ప్రభుత్వం తుది ఆమోదం తర్వాత దీనిపై గవర్నర్ ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఓటుకు నోటు వ్వవహారంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తన అధికారాలపై స్పష్టత ఇవ్వాలని ముకుల్ రోహత్గీని సంప్రదించారు.
ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ సూచన మేరకు రోహత్గీ తన అభిప్రాయంతో గత వారమే నివేదికను కేంద్రానికి పంపించారని, అది గవర్నర్ కార్యాలయానికి సోమవారం చేరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8పై గవర్నర్ నరసింహాన్కు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచనలు చేశారని వస్తున్నవన్నీ గాలి వార్తలేనని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులో మాట్లాడారు.
‘‘అటార్నీ జనరల్ స్వయంగా గవర్నర్కు సూచనలు ఇస్తారని నేను అనుకోవడంలేదు. ఆయన కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తన అభిప్రాయాలను తెలుపుతారు'' అని అన్నారు. ఆటార్నీ జనరల్కు రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులు ఉండొచ్చనే సూచన చేయరని తెలిపారు.
శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉండదని వినోద్ కుమార్ చెప్పారు. గవర్నర్ న్యాయ సలహా కోసం నేరుగా అటార్నీ జనరల్ని సంప్రదించే అవకాశం లేదన్నారు. అలాగే గవర్నర్ కేవలం ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తి హక్కుల వ్యవహారాలకు సంబందించి తన బాధ్యతను నెరవేరుస్తారు తప్ప ఏసీబీ చేసే దర్యాప్తులో ఆయనకు ఎలాంటి పాత్రా ఉండదన్నారు.
మరో ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ అటార్నీ జనరల్ నుంచి లేఖ ఏదీ వెళ్లలేదని తాను సేకరించిన సమాచారాన్ని బట్టి స్పష్టమైందని అన్నారు. తాను అటార్నీ జనరల్ కార్యాలయానికి ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నానని, ఆయన ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం లండన్ వెళ్ళారని గౌడ్ పేర్కొన్నారు.