వేడుక వెలుగులు: హుస్సేన్సాగర్లో బతుకమ్మ పుట్టీలు, విదేశీ మహిళల ఆటపాటలు
Recommended Video
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ అలలపై తేలిఆడిన బతుకమ్మ పుట్టీలు మరింత అందాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చాయి. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హుస్సేన్సాగర్లో నిర్వహించిన పుట్టీల బతుకమ్మ పోటీలు చూపరులను కట్టిపడేశాయి.
ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ పుట్టీలు
100 మంది సెయిలర్లతో పుట్టీలతో 100 తేలియాడే(ఫ్లోటింగ్) బతుకమ్మల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ముఖ్య అతిథులుగా డీజీపీ మహేందర్రెడ్డి, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకం కాబట్టి రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడానికి సాంస్కృతిక శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
తేలియాడే బతుకమ్మలు..
హుస్సేన్సాగర్లో పుట్టీల బతుకమ్మల పోటీలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుందని తద్వారా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని డీజీపీ అన్నారు. వచ్చే ఏడాది నాటికి తేలియాడే బతుకమ్మ పుట్టీ(పడవ) పోటీలను వేలాదిమంది ప్రత్యేకంగా తరలివచ్చి చూసేస్థాయికి తీసుకువెళ్తామని పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
శిక్షణ పొందిన అమ్మాయిలు..
కాగా, బుధవారం సెయిలర్ శిక్షణ పొందిన అమ్మాయిలు హుస్సేన్ సాగర్లో, ఆకాశంలో 80నుండి 100 ఎత్తులో హాట్ఎయిర్ బెలూన్లో బతుకమ్మ ఆడుతారని వెల్లడించారు. తెలంగాణ పర్యాటకశాఖ తరఫున రెండోపుట్టీ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నామని వీటిని బతుకమ్మ, దసరాలతోకలిపి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీలుగామారుస్తామన్నారు. పుట్టీపోటీలలో అన్ని జిల్లాలుపాల్గొనేలా ప్రణాళికలురచిస్తున్నామని, పాల్గొనేవారికి శిక్షణ, సౌకర్యాలను కల్పిస్తామని యాచ్ క్లబ్ ప్రెసిడెంట్ సుహేమ్ తెలిపారు
బతుకమ్మ వేడుకల్లో విదేశీ మహిళలు
సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్లో అంతర్జాతీయ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారీస్కు చెందిన వివిధ దేశాలకు చెందిన మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. థాయిలాండ్, అర్జెంటీనా, రష్యా, బెలారస్, యూక్రేయిన్ తదితర 25 దేశాలకు చెందిన వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చెందిన నృత్యాలు చేసి బతుకమ్మ ఆడుతూ ఆకట్టుకున్నారు. పర్యాటకశాఖ పిలుపు మేరకు రష్యాకు చెందిన డివైన్ లైట్ ఆర్ట్ అండ్ కల్చర్ గ్రూప్ వారు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.