అన్నంత పని చేసిన అసదుద్దీన్ ఓవైసీ... ఆడియో టేపుల్లో ఏముందో తెలుసా..?
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ అన్నంత పనిచేశారు. నిర్మల్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ప్రచారం చేయకుండా ఉంటే రూ. 25 లక్షలు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఆఫర్ చేశారని సంచలన కామెంట్స్ చేసిన అసదుద్దీన్ దానికి సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేశారు. ఇందులో కాంగ్రెస్ నేత ముధోల్ అభ్యర్థి రామారావు పాటిల్ మజ్లిస్ నేత జబ్బర్ అహ్మద్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.
ప్రచారం చేయకుండా ఉండేందుకు రూ.25 లక్షలు ఆఫర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మజ్లిస్ అధినేత సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్కు పరోక్ష మద్దతు ఇస్తున్న మజ్లిస్ నేత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించకుండా ఉండేందుకు తనకు నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి రూ.25 లక్షలు ఆఫర్ చేశారని అసదుద్దీన్ చెప్పారు. తన దగ్గర ఆడియో టేపులు ఉన్నట్లు అసదుద్దీన్ చెప్పారు.
అసదుద్దీన్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి. తనకు అసదుద్దీన్తో పరిచయమే లేదన్నారు. దమ్ముంటే అసదుద్దీన్ ఆడియో టేపులను విడుదల చేయాలని సవాల్ విసిరారు. మహేశ్వర్ రెడ్డి సవాలు విసరడంతో అసదుద్దీన్ ఓవైసీ అన్నంత పని చేశారు. ఆడియో టేపులను విడుదల చేసి షాకిచ్చారు.
కాంగ్రెస్ నేత రామారావు పాటిల్ మంతనాలు
ఈ ఆడియోలో కాంగ్రెస్ నేత ముధోల్ అభ్యర్థి రామారావు పాటిల్ మజ్లిస్ నేత జబ్బర్ అహ్మద్తో మాట్లాడినట్లుగా ఉంది. ఇందులో అసదుద్దీన్ ప్రచారానికి రాకుండా ఉంటే ఆయనకు 25 లక్షలు ఇస్తామని చెబుతున్నట్లుగా ఆడియోలో ఉంది. అయితే రూ.25 లక్షలు కాదు రూ. 50 లక్షలు ఇచ్చినా అసదుద్దీన్ను కొనలేమని జబ్బర్ అహ్మద్ సమాధానం ఇచ్చినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. తన పార్టీలో తనకు మంచి స్థానం ఉందని ఇలాంటి కార్యక్రమాలు తాను చేయలేనని జబ్బర్ చెప్పినట్లుగా ఆడియోలో స్పష్టంగా ఉంది. కావాలంటే నేరుగా వెళ్లి అసదుద్దీన్తో మాట్లాడాలని జబ్బర్ చెప్పినట్లు ఆడియోలో ఉంది. మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఆడియోలో ఒకటికి రెండు సార్లు వినిపించింది.
మహేశ్వర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే చర్చ
ఆడియో టేపులు దమ్ముండే విడుదల చేయాలని మహేశ్వరరెడ్డి సవాలును అసదుద్దీన్ స్వీకరించినట్లున్నారు. చెప్పినట్లుగానే ఆయన టేపులను విడుదల చేశారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన మహేశ్వరరెడ్డి మాటమీద నిలబడుతారా అని నిర్మల్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటోదోనని ఆసక్తిగా తిలకిస్తున్నాయి రాజకీయ వర్గాలు.