విషాదం.. కరోనా వేళ ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య...
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. లాక్ డౌన్ పీరియడ్లో నగరాల నుంచి ఎంతోమంది వలస కూలీలు కాలి నడకనే వేల కి.మీ నడిచి వెళ్లిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా చాలామంది నగరాల్లోని బతకలేని పరిస్థితి నెలకొనడంతో అద్దె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలను తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
నల్గొండ జిల్లా చుండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్(22) మంగళవారం(జూలై 7) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ కొత్త ఆటో కొనుగోలు చేసిన కొద్దిరోజులకే లాక్ డౌన్ విధించడంతో... ఫైనాన్స్ డబ్బులు చెల్లించలేకపోయాడు. మరోవైపు ఫైనాన్స్ యాజమాన్యం కిస్తీల కోసం ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇదే క్రమంలో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో ఆర్థిక సమస్యల గురించి ప్రస్తావించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.