రమేష్ హత్య: వివాహేతర సంబంధమే కారణమా?
నల్గొండ: నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.
కనగల్కు చెందిన రమేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. రమేష్ తల, మొండెం వేరు చేసి దారుణంగా హత్య చేశారు అయితే ఈ హత్య ఎవరు చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కనగల్ లో కిషన్ అనే వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా రమేష్ పనిచేస్తున్నారు. భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద మొండాన్ని పోలీసులు గుర్తించారు. బొట్టుగూడ సమీపంలో జెండా దిమ్మె వద్ద తలను వదిలేశారు.
హైటెక్ కాలనీ సమీపంలోని ఓ ఇంటి వద్దకు పోలీసు జాగిలం వచ్చి ఆగిపోయింది. అయితే వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య చోటు చేసుకొందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చకామెర్ల వ్యాధితో రమేష్ బాధపడుతున్నారు. అయితే పచ్చకామెర్ల వ్యాధి మందుల కోసం నల్గొండకు వచ్చిన రమేష్ సోమవారం ఉదయం శవమై తేలారు.
వారం రోజుల క్రితం నల్గొండ మున్సిఫల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రమేష్ను హత్య చేసిన ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.