సార్వత్రిక సమ్మె ఎఫెక్ట్: జనం జేబులకు చిల్లు, రెట్టింపు ధరలు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోల్లో 10వేల బస్సులు నిలిచిపోయాయి.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను పాటిస్తున్నారు. దీంతో జిల్లాలోని 11 డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. దీంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు ఆగిపోవడంతో ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.
సార్వత్రిక సమ్మె కారణంగా ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో ప్రజలు సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అవకాశంగా తీసుకుని రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇక షేర్ ఆటోలు, మామూలు ఆటోల్లో ప్రయాణించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల మీదుగా వెళ్లే షేర్ ఆటోలలో ఒక్కో ఆటోలో దాదాపు 15 మంది వరకు ఎక్కిస్తున్నారు. డ్రైవర్కు అటూ ఇటూ ఐదుగురు కూర్చుంటున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆటోలు వెళ్తున్నాయి. ఇక రామంతపూర్ నుంచి కోఠి వరకు వెళ్లాలంటే సాధారణంగా షేర్ ఆటోలో 15 రూపాయలు తీసుకుంటారు.
కానీ, శుక్రవారం సార్వత్రిక బంద్ కారణంగా ఈ ధర 100 రూపాయలకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ సమ్మెలో 18 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. రెండేళ్ల బోనస్ చెల్లింపు, కనీస వేతనం పెంపులాంటి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ఎంతమాత్రం సరిపోవని పేర్కొంటూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ బంద్లో బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గొంటున్న నేపథ్యంలో నేడు అన్ని బ్యాంకుల శాఖలు మూతపడ్డాయి. కార్మికులు శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెతో బ్యాంకులు, ప్రజా రవాణా, టెలికం వంటి అత్యవసర సేవలు పూర్తిగా స్తంభించాయి.
సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 12 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్న కార్మికులు ప్రధానంగా కనీస వేతనాలు రూ.18 వేలకు పెంచాలని, అధిక ధరలను నియంత్రించాలని, కనీస పెన్షన్ నెలకు రూ.3 వేలు ఇవ్వాలని కోరుతున్నారు.