: ఆయుర్వేదిక్ బిర్యానీ ... కరోనా టైమ్ లో రోగ నిరోధక శక్తిని పెంచే బిర్యానీ హోటల్ కు భలే గిరాకీ !!
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు. కరోనా కష్టకాలంలో వ్యాపారాలు లేక చాలా బిజినెస్ లు పడ్డాయి. అలాంటి వాటిలో ఫుడ్ బిజినెస్ ఒకటి . కరోనా వైరస్ రాకముందు కస్టమర్లతో కళకళలాడిన రెస్టారెంట్లు, హోటళ్ళు ఇప్పుడు కరోనా దెబ్బకు వచ్చి తినే వాళ్ళు లేక వెలవెలబోతున్నాయి.
ఆందోళన కలిగించే వార్త.. కరోనా యాంటీ బాడీస్ 50రోజుల తర్వాత క్షీణిస్తాయని అధ్యయనం
బాన్సువాడ బిర్యానీ హోటల్ కొత్త ఆలోచన
కరోనాతో ఫుడ్ ఇండస్ట్రీ కుదేలైంది. చాలాచోట్ల రెస్టారెంట్ల యజమానులు అద్దెలు కట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.ఈ సమయంలో కరోనా కు సంబంధించి, ప్రజలను కాపాడటానికి, వారికి అవసరం అయ్యే విధంగా ఫుడ్ ఐటమ్స్ చేసి పెట్టే బిజినెస్ పై దృష్టి పెరిగింది. ఇప్పటికే చాలామంది ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్ అంటూ వ్యాపారాన్ని మొదలుపెట్టగా, ఇప్పుడు ఏకంగా కరోనా సమయంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక్ బిర్యానీ అంటూ ఓ బిర్యాని పాయింట్ రన్ చేస్తున్నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన ఓ బిర్యానీ పాయింట్ యజమాని.
ఇమ్యూనిటీ బూస్టింగ్ చికెన్ దమ్ బిర్యానీ
వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల పైన ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయుర్వేదిక్ చికెన్ దమ్ బిర్యాని తయారుచేసి బిర్యానీ ప్రియులకు అందిస్తున్నాడు. దీంతో ఆ బిర్యానీ హోటల్ కు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు బిర్యానీ కోసం క్యూ కడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే శొంఠీ, మిరియాలు , ఉసిరి, దాల్చిన చెక్క, లవంగాలు, తులసి పౌడర్ ను వినియోగించి బిర్యాని తయారు చేస్తున్నారు. ఈ చికెన్ బిర్యానీ తో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని సదరు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
బిర్యానీ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం
ఈ బిర్యాని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటూ ఏకంగా బ్యానర్లు పెట్టి మరీ బిర్యానీ విక్రయాలు సాగిస్తున్నాడు. మొన్నటికి మొన్న కరోనా సోకకుండా కాపాడే ఆయుర్వేద చీరలను తయారు చేసి విక్రయిస్తున్న ఈ విషయాన్ని విన్నాం. రోగనిరోధక శక్తిని పెంపొందించే పానీయాలు, టాబ్లెట్లు,అప్పడాలు వంటి స్నాక్స్ ఇప్పటికే మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కరోనా నుండి రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం ఆయుర్వేదిక్ బిర్యానీని కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు.
కరోనా టైం లో ఇమ్యూనిటీ పెంచే కొత్త వ్యాపారాలు
కరోనా సమయంలో కొత్తగా ఆలోచించి సందర్భానికి తగినట్లుగా బిజినెస్ చేస్తూ ఇలాంటి వాళ్లంతా కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఎప్పుడు కరోనా సోకుతుందో అని భయపడుతున్న వారంతా ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ ల కోసం పరుగులు పెడుతున్నారు. ఎవరు దేనితో ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పినా వాటిని తెచ్చుకుని వాడేస్తున్నారు. ఇదే అడ్వాంటేజ్ గా రకరకాల ఇమ్యూన్ బూస్టింగ్ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి.