తెలుగు రాష్ట్రాలకు కేరళ సెగ.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా చిచ్చు రేపుతోంది. అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలో కేరళ బంద్ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు మిన్నంటాయి.
హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతంలోని ఆనంద్బాగ్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడం కేరళ ప్రభుత్వ తప్పిదమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈక్రమంలో కేరళ సీఎం దిష్టిబొమ్మ తగులబెట్టారు. హిందు వ్యతిరేక కార్యకలాపాలు ఆపాలని.. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
శబరిమల ఘటనపై యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ.. ఆలేరులో అయ్యప్ప భక్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. శబరిమల పవిత్రతను కాపాడాలని నినదించారు.