అసద్కు పోటీగా అజారుద్దీన్! కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులపై తుది కసరత్తు ..!!
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల యుద్దం మొదలుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలో దింపడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే డీసీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సర్వేలకు శ్రీకారం చుట్టింది. రెండు లోక్సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులకు సమస్య ఉండదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం దృష్టి సారించి డీసీసీలు ప్రతిపాదించిన పేర్లతో బాటు మరికొందరి పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై బలమైన అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్తో బాటు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ అభ్యర్థిత్వాలను లోతుగా పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఖరారైన లోక్ సభ అభ్యర్ధులు..! అదికార పార్టీకి ధీటుగా పోటీ..!!
చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. నాగర్కర్నూలు నుంచి ఎంపీ నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈసారి కొత్త అభ్యర్థి దిశగా కాంగ్రెస్ దృష్టి సారించింది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ టికెట్ రేసులో ముందున్నారు. ఈ జిల్లా నేతలు కొత్త అభ్యర్థులకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. మహబూబ్నగర్ నుంచి పోటీకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ కొత్త అభ్యర్థి వేటలో ఉంది. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి మహబూబ్నగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపడంతో పాటు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పాత కొత్త కలయికతో అభ్యర్థుల ఎంపిక..! గెలుపే లక్షం అంటున్న కాంగ్రెస్..!!
భువనగిరి స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నా ఈ సారి అక్కడ నుంచి వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థి వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ టికెట్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర పార్టీ కీలక నేతల మద్దతు కూడా ఆయనకి ఉన్నట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి ఈ సారి పోటీకి ఆసక్తి చూపని మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ భువనగిరి లోక్సభ నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు యాస్కీకి మద్దతు పలుకుతున్నారు.
వరంగల్, మల్కాజిగిరి నుంచి బలమైన అభ్యర్థుల కోసం వడపోత..! రెండు రోజుల్లో ఖరారు..!!
మల్కాజిగిరి, వరంగల్లలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ కొనసాగిస్తోంది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్తో బాటు ఇతర నేతలు పోటీపడుతుండగా తాజాగా ఎమ్మెల్సీ రాములు నాయక్ అభ్యర్థిత్వాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. ఖమ్మం లోక్సభ టికెట్కు గట్టిపోటీ ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మెజారీటీ స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో పోటీ అధికంగా ఉంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి టికెట్ కోసం దిల్లీ పెద్దల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ ఖాయమన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్ నుంచి మధుయాస్కీ పోటీ చేయకుంటే ప్రత్యామ్నాయం వైపు కాంగ్రెస్ దృష్టి సారించనుంది.పెద్దపల్లి టికెట్ను యువజన కాంగ్రెస్ కోటాలో ఇవ్వాలని ఆ విభాగం నేతలు ప్రయత్నిస్తున్నారు.
తీవ్రంగా నెలకొన్న పోటీ..! గెరుపుగుర్రాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్..!!
మెదక్ నుంచి లోక్సభ టికెట్ కోసం శాసనసభ ఎన్నికలప్పుడు తెరాస నుంచి కాంగ్రెస్లో చేరిన గాలి అనిల్కుమార్తో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పోటీపడుతున్నారు. నల్గొండ టికెట్పై తీవ్ర స్థాయిలో పోటీ కొనసాగుతోంది. పార్టీ ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతిరెడ్డి, రఘువీర్రెడ్డి(జానారెడ్డి తనయుడు), పటేల్ రమేష్రెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది. ఆదిలాబాద్ లోక్సభ టికెట్కు ప్రధానంగా పార్టీ నేతలు సోయం బాపూరావు, రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్ల మధ్య పోటీ ఉంది.సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ ఎం.అంజన్కుమార్ యాదవ్, జహీరాబాద్ నుంచి పార్టీ నేత మదన్మోహన్రావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖాయమైనట్లే అని పార్టీ వర్గాలు నిర్దారిస్తున్నాయి.