ఫ్రెండ్స్ పెట్టుబడులు పెడతానంటే తెలంగాణ పేరు చెప్పిన అజారుద్దీన్!
హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మిత్రులు కొందరు హైదరాబాదులో, రంగారెడ్డిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని అజారుద్దీన్ చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల స్థాపన అంశంపై చర్చించేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి మహేందర్ రెడ్డితో ఆయన గురువారం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం అజర్ మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు తన మిత్రులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చేందుకు కలిసినట్లు చెప్పారు. తాను కూడా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారని తెలుస్తోంది.
మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన మిత్రులు పెట్టుబడులు పెడతానంటే తెలంగాణలో పెట్టాలని చెప్పానన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని చెప్పానని తెలిపారు. కాగా, అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు కూడా.
కాగా, తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలను సీఎం కేసీఆర్ ప్రోత్సహించడమే కాకుండా, పరిశ్రమలకు రాయితీలు కూడా ఇస్తున్నారనే అంశాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దరఖాస్తు చేసుకొన్న తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అజారుద్దీన్కు మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.