విషాదం: బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వర్ధన్నపేట గ్రామానికి చెందిన 21ఏళ్ల అనూష తిమ్మాపూర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం అనూష కాలేజీకి రాకపోవడంతో సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.
ఈ క్రమంలో తల్లిదండ్రులు అనూషకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందినవారు హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. అనూష మధ్యాహ్న భోజనానికి కూడా రాలేదని, చెప్పి ఆమె గదికి వద్దకు వెళ్లారు. గది లోపలివైపు గడియ పెట్టి ఉండటంతో కిటికీలోంచి చూశారు.
బాత్రూం దగ్గర అనూష కాళ్లు కనిపించడంతో తలుపులు పగలగొట్టి లోనికివెళ్లి చూశారు. అయితే, అప్పటికే అనూష ప్రాణాలు కోల్పోయింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు అనూష తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనూష గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ నితికాపంత్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.