ప్రాణం తీసిన ఈత సరదా: బీటెక్ విద్యార్ధి మృతి
హైదరాబాద్: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట వద్ద ఉన్న ఓ క్వారీకుంటలో పడి బీటెక్ విద్యార్ధి చనిపోయాడు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
లాల్గడి మలక్ పేట గ్రామానికి చెందిన ఆల నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సైనికపురిలో నివాసముంటున్నాడు. అతని కుమారుడు అక్షిత్ రెడ్డి (20) పంజాబ్లోని లౌలి ప్రోపెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు.
15 రోజులు సెలవులు రావడంతో సైనిక్పురికి వచ్చాడు. గురువారం సాయంత్రం స్నేహితుడు రుషీల్ చక్రవర్తితో బొమ్మరాశి పేటకు చేరుకున్నారు. ఆ తర్వాత క్వారీకుంట వద్దకు చేరుకున్నారు. ఇంతలో స్నేహితుడు రుషీల్ చక్రవర్తి కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి అక్షిత్ కనిపించలేదు.
చక్రవర్తి అదే రోజు సాయంత్రం శామీర్ పేట పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. బట్టలు, సెల్ ఫోన్ లభించింది. నీటికుంటలో పడి మృతి చెంది ఉంటారని నిర్దారణకు వచ్చన పోలీసులు జీడిమెట్లకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం మధ్యాహ్నాం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. కొడుకు మృతితో నర్సింహారెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బంధువు కుమారుడు అక్షిత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండలంలోని బొమ్మరాశిపేట పరిధిలోని సంఘటన స్ధలానికి చేరుకుని చేపట్టిన చర్యలను పర్యవేక్షించారు.