మోడీకి మద్దతుగా బాహుబలి ప్రభాస్ అద్భుతమైన సందేశం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ ప్రకటించాడు. బాహుబలితో ఆయన అంతర్జాతీయ స్థాయిలు గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
మోడీ లేఖతో ప్రతిజ్ఞ..
దేశాన్ని శుభ్రంగా ఉంచడం ఒక పనిగా కాకుండా అలవాటుగా మార్చుకుంటానని ప్రభాస్ ప్రతిజ్ఞ పూనాడు. ఇటీవల క్లీన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛ్ భారత్ ఆవశ్యకతను ప్రచారం చేయాలని కొంతమంది ప్రముఖులకు ప్రధాని మోడీ వ్యక్తిగతంగా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
గాంధీజీ స్ఫూర్తి
ఈ లేఖపై ప్రభాస్ స్పందిస్తూ.. ‘అద్భుతమైన అభిమానులారా.. స్వచ్ఛత కోసం పాటుపడిన మహాత్మగాంధీ జయంతి త్వరలో రానుంది. ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని స్వచ్ఛతను, పచ్చదనానికి మనవంతు ప్రచారం కృషి చేద్దాం' అని ప్రభాస్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
పరిశుభ్రంగా.. ఆరోగ్యంగా.. మనవంతుగా..
‘నా దేశం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది మన అలవాటుగా కావాలి అందుకోసం పరిశుభ్రమైన భారతదేశం కోసం కృషి చేద్దాం. దీంతో మన దేశం ఇప్పటికన్నా మరింత అందంగా కనిపిస్తుంది. జై హింద్ ' అని ప్రభాస్ పేర్కొన్నాడు.
రజినీ, రాజమౌళి మద్దతు
కాగా, ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమానికి ఇప్పటికే రజనీకాంత్, రాజమౌళి, అక్షయ్ కుమార్, అనుష్క శర్మతో పాటు మరికొంత మంది ప్రముఖులు ప్రధాని లేఖకు స్పందిస్తూ తమ మద్దతును ప్రకటించిన సంగతి విదితమే.