హైదరాబాద్ బిర్యానీ, బాహుబలిపై ధోనీ, రాజమౌళి ప్రపంచకప్ 'ఆశ'
హైదరాబాద్: తనకు హైదరాబాద్ బిర్యానీ మిస్ కావొద్దనిపిస్తోందని భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎంఎస్ ధోనీ' చిత్రం ఆడియో విడుదల వేడుక జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
ఈ ఆడియో వేడుకకు ధోనీ, ప్రముఖ దర్శకులు రాజమౌళితో పాటు తదితరులు హాజరయ్యారు. ఆడియోను ధోనీ విడుదల చేశారు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధోనీ క్యారెక్టర్లో సుశాంత్ సింగ్ రాజుపుత్ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆడియో విడుదల సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. హైదరాబాద్కు వస్తే బిర్యానీ మిస్ కావొద్దనిపిస్తోందన్నారు. ఇక్కడ ఆడపడుచులకు దొరికే గాజుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే ఉస్మానియా బిస్కట్ల గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్ ప్రేక్షకుల స్పందన భారత జట్టుకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంటుందన్నారు. దర్శకులు రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం చూశానని తెలిపారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంచి చిత్రాలు వస్తున్నాయని ప్రశంసించారు. భారత జట్టుకు హైదరాబాద్లో మంచి రికార్డు ఉందన్నారు. కాగా, వచ్చే ప్రపంచ కప్కు నాయకత్వం వహించాలని ధోనీని రాజమౌళి కోరారు.