దశాబ్దాల కల: 'బాహుబలి'కి టి అసెంబ్లీ అభినందన, జగన్ కూడా
హైదరాబాద్: ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ శాసన సభ మంగళవారం నాడు అభినందనలు తెలిపింది. బాహుబలికి జాతీయ అవార్డు వచ్చిందని తెలిసిందని, ఇది సంతోషకరమని కెసిఆర్ అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సోమవారం నాడు బాహుబలి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. బాహుబలి సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన నేపథ్యంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాదికి నూట యాభైకి పైగానే చిత్రాలు, కాకలు తీరిన కథానాయకులు, దిగ్గజాల్లాంటి దర్శకులు, మేధావులైన నిర్మాతలు.. ఇలా ఎంతమంది ఉన్నా జాతీయ అవార్డుల్లో మాత్రం తెలుగు సినిమా ఎప్పుడూ సున్నానే. ప్రాంతీయ ఉత్తమ చిత్రం జాబితాలో తెలుగు సినిమా పేరు కనిపిస్తూనే ఉన్నా ఏదో వెలితి.
ఉత్తమ గీత రచయితగా తెలుగువారిని మూడుసార్లు జాతీయ పురస్కారాలు దక్కాయి. అప్పుడప్పుడూ సాంకేతిక నిపుణులు జాతీయ స్థాయిలో మెరుస్తుంటారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 62 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మాత్రం బాహుబలితో ఆ కల నెరవేరింది.
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టారు. అంతకుముందు, సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ. కోటిన్నర నుంచి రూ.3 కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఈ నిధులను ఎమ్మెల్యేలే పూర్తిగా ఖర్చు చేసేందుకు అధికారం కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఏ పార్టీ ఉన్నా నియోజకవర్గాల అభివృద్ధే ప్రభుత్వ పరమావధి అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు చీఫ్ స్రెకటరీ కంటే ఎక్కువ హోదా ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు.
ఏ స్థాయిలో కూడా ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్కు భంగం కలుగవద్దన్నారు. శాసనసభ్యులను గౌరవించకపోతే మనకూ అవమానమేనన్నారు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేలను తప్పకుండా ఆహ్వానించాలని అన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలన్నారు.