పోలీసుల చేతికి చిక్కిన తాయెత్తుల బాబా: భార్యను చంపేసిన భర్త
ఖమ్మం: అమావాస్య రోజు చాలా మంచిది, నీ గ్రహస్థితి బాగాలేదు, తాయత్తులు కట్టి నీకు మంచి జరిగేలా చేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న బాబాను ఖమ్మం జిల్లా కిన్నెరసాని గ్రామ ప్రజలు సోమవారం పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధవారపు పేటకు చెందిన లాల్మియా అనే బాబా సోమవారం ఉదయం మండలంలోని కిన్నెరసానికి వచ్చాడు.
కిన్నెరసానికి చెందిన బుడగం సత్యనారాయణ షాపు వద్దకు లాల్మియా బాబా వచ్చాడు. వచ్చి రాగానే షాపులో ఉన్న సత్యనారాయణతో నీ గ్రహస్థితి బాగాలేదు, నీ మీద దిష్టి ఉంది. ఇవాళ అమావాస్య, పదివేలిస్తే అది తొలగిపోయి రేపటి నుంచి అంతా మంచే జరుగుతుందని మాటలతో నమ్మించాడు. పదివేలు ఇచ్చుకోలేనని సత్యనారాయణ చెప్పుకుని రూ.3116లకు ఒప్పుకొని డబ్బులు కుడా ఇచ్చేశాడు.
ఇంట్లోని వారికి సాంబ్రాణి వేసిన తాయత్తులు కట్టి ఇంకా అదనంగా ఇతర వస్తువులు కావాలని కోరడంతో సత్యనారాయణ లాల్మియా బాబాను షాపులో బంధించి పొలీసులకు ఫోన్ చేశాడు. లాల్మియా తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలీసులు వచ్చి బాబాను ప్రశ్నించి స్టేషన్కు తీసుకువెళ్లారు.
ఇదిలావుంటే, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో దారుణ సంఘటన జరిగింది. నవీన్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారీ అయ్యాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు పడేసేందుకు నవీన్ సోదరుడు, అతని స్నేహితుడు యత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నవీన్ సోదరుడిని, స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.