తెలంగాణకు నీళ్లు: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన మహారాష్ట్ర
ముంబై: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి ఒకటిన ఒకరోజు గేట్లు తెరవాల్సి ఉంటుంది. తాగునీటి అవసరాల కోసం బాబ్లీ నీటిని దిగువకు వదలాలి. అందులో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో గేట్లు తెరిచారు.
బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 0.04 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా దిగువకు వచ్చే నీటి శాతం స్వల్పంగానే ఉండనుంది. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో బాబ్లీ ప్రాజెక్టు పూర్తి చేసింది.
నిర్మాణ సమయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేంద్రం జలసంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు ఒప్పందం కుదిరింది.
ప్రతి ఏటా జులై 1న గేట్లు తెరిచి అక్టోబరు 28న మూసివేయాలని ఆదేశించింది. మళ్లీ మార్చి 1న ఒకరోజు అర టీఎంసీ నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.