అందోల్లో బాబు మోహన్కు చేదు అనుభవం
సంగారెడ్డి: టీఆర్ఎస్ నేత, అందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజచేసేందుకు వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది.
సంగారెడ్డి జిల్లాలోని అందోల్లో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న విద్యుత్తు ఉపకేంద్రం పనులకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే బాబు మోహన్ జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లుతో కలిసి విచ్చేశారు.
ఆ స్థలాన్ని గతంలో ఓ సంఘానికి కేటాయించి ఇప్పుడు విద్యుత్తు ఉప కేంద్రానికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు ఎమమెల్యేను అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాబు మోహన్ పనుల్ని ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.