అంతా నీ ఇష్టమేనా?, ఎమ్మెల్యే అంటే లెక్క లేదా!: అధికారిపై బాబు మోహన్ ఫైర్
గతంలో సీసీ రోడ్డుకు చేసిన మంజూరు నిధుల గురించి ఆరా తీశారు. నిధులిచ్చినా పనులెందుకు చేయలేదని నిలదీశారు.
మెదక్: అభివృద్ధి పనుల విషయంలో ఓ అధికారి వ్యవహరించిన తీరు పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఫైర్ అయ్యారు. తాను చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? అన్న తరహాలో సదరు అధికారికి క్లాస్ తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదంటూ కాస్త గట్టిగానే మందలించారు.
మెదక్ జిల్లా ఆందోల్ లో చేపట్టిన హరితహారం కార్యక్రమం సందర్భంగా పంచాయితీరాజ్ ఏఈ చంద్రశేఖర్ పై ఎమ్మెల్యే బాబూమోహన్ ఈ తరహాలో గుస్సా అయ్యారు. శుక్రవారం నాడు రేగోడ్ పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటడానికి వెళ్లిన ఆయన.. గతంలో అక్కడ సీసీ రోడ్డుకు మంజూరు నిధుల గురించి ఆరా తీశారు. నిధులిచ్చినా పనులెందుకు చేయలేదని నిలదీశారు.
దీనికి బదులిస్తూ.. ఆ సీసీ రోడ్డు నిధులతో మరో చోట సీసీరోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఏఈ చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. అభివృద్ధి నిధులను ఇష్టారీతిన ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇలాగే వ్యవహరిస్తే ఉద్యోగం ఊడదీస్తా అంటూ హెచ్చరించారు. అంతా నీ ఇష్టమేనా?.. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్! అంటూ ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.