'బాబు మోహన్ చేరిక బీజేపీకి బలాన్ని ఇచ్చింది, క్రికెట్లో ఒక్కోసారి 10 రన్స్కే ఔటవుతారు'
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ సోమవారం కలిశారు. రాంనగర్లోని దత్తాత్రేయ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాబు మోహన్ ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
టిక్కెట్ ఎందుకివ్వలేదో తెలియదు, బీజేపీది మంచి అడ్మినిస్ట్రేషన్: బాబూమోహన్
బాబు మోహన్కు దత్తాత్రేయ శాలువా కప్పి సత్కరించి, మిఠాయి తినిపించారు. అనంతరం బాబుమోహన్ విలేకరులతో మాట్లాడారు. తాను అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
బాబు మోహన్ పార్టీలో చేరడం బలాన్నిచ్చింది
బాబు మోహన్ పార్టీలో చేరడం బీజేపీకి ఎంతో బలాన్ని ఇచ్చిందని దత్తాత్రేయ అన్నారు. నీతి, నిజాయతీ, మేధావులు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
క్రికెట్లో ఒక్కోసారి 10 రన్స్కే అవుటవుతారు
100 సీట్లు గెలుచుకుంటామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. బండారు దత్తాత్రేయ స్పందించారు. క్రికెట్ మ్యాచ్లో వంద పరుగులు చేయాలని అందరు బ్యాట్స్మెన్ వస్తారని, కానీ ఒక్కోసారి పది పరుగులకే అవుట్ కావొచ్చని వ్యాఖ్యానించారు.
10న కరీంనగర్లో అమిత్ షా బహిరంగ సభ
కాంగ్రెస్ పాలన సర్వస్వం అవినీతి, కుటుంబ, అక్రమ, దోపిడీ పాలన అని బీజేపీ నేత కిషన్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెస్ చరిత్రను ప్రజలు మరిచిపోరాని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని తెలిపారు. ఈ నెల 10 కరీంనగర్లో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బహిరంగ సభ విజయవంతమవుతుందన్నారు.
బీజేపీ బలం పెంచుకుంటోంది
అమిత్ షా సభ ఏర్పాట్లపై చర్చించేందుకు జిల్లా నేతలతో అత్యవసర సమావేశం అవుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ వేదికగా జరిగే ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేస్తామని అన్నారు. తద్వారా తెలంగాణలో బీజేపీకి మరింత ప్రజావిశ్వాసం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో తమ పార్టీ బలాన్ని పెంచుకుందని, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలిచే దిశగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.