ఓడిపోతే కేసీఆర్ , కేటీఆర్ లు కూడా ఔట్ డేటెడ్ అవుతారా ? బీజేపీనేత బాబు మోహన్ ప్రశ్న
తెలంగాణాబీజేపీ శ్రేణుల్లో నడ్డా పర్యటన జోష్ నింపింది. తెలంగాణా రాష్ట్రానికి వచ్చిన నడ్డా భారీ బహిరంగ సభా వేదికగా తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుంది అంటూ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో చేసిన దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక నడ్డా వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఒకే ఒక్క సీటు గెల్చుకున్న ఔట్ డేటెడ్ పార్టీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేత బాబు మోహన్ స్పందించారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని బీజేపీ నాయకుడు బాబు మోహన్ అన్నారు. నేడు ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఆయన జేపీ నడ్డా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు కాలం చెల్లనుంది అని ఆయన పేర్కొన్నారు . మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని జేపీ నడ్డా ఆదేశించారని చెప్పిన బాబు మోహన్ బీజేపీలో ముందు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. ఎక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కడతారో అని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరిపాలన చేతకాక టీఆర్ఎస్ నాయకులు బీజేపీని విమర్శిస్తున్నారని బాబు మోహన్ మండిపడ్డారు .
బీజేపీ సామర్ధ్యం ఏంటో త్వరలోనే తెలుస్తుంది అన్నారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదో కొంత కాలం ఆగితే టీఆర్ఎస్కు తెలుస్తుందన్నారు బాబు మోహన్ . టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కూల్చటం తప్ప ఏమీ తెలియదన్నారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ ఉండదని.. ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్లు అవుట్ డేటెడ్ అవుతారా? అని ఆయన ప్రశ్నించారు . కరీంనగర్లో టీఆర్ఎస్ ఎంపీ ఓటమిలో తన పాత్ర ఉందని చెప్పిన బాబు మోహన్ రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో తన సత్తా చాటుతుందని పేర్కొన్నారు.