ఉప్పల్లో ఘోరం: మేడపై చిన్నారి తల, క్షుత్రపూజలే కారణమా?
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భవనంపై చిన్నారి తల లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఉప్పల్ చిలుకానగర్లో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. క్షుద్రపూజలేమైనా జరిగియా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. చిలుకానగర్లో నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటి డాబాపైన బట్టలు ఆరవేయడానికి వెళ్లిన అతని అత్త అక్కడ చిన్నారి తల పడి ఉండటం చూసింది. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. జాగిలాలతో అక్కడి పరిసరాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. అయితే ఆ జాగిలాలు తల లభ్యమైన ఇంటి పక్కన నివాసముండే నరహరి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాయి. రెండుసార్లు ఆ జాగిలాలు ఆ ఇంట్లోనే తచ్చాడాయి. దీంతో పోలీసులు నరహరిని అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా, బుధవారం చంద్రగ్రహణం కావడంతో క్షుద్ర పూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. అసలు భవనం పైకప్పు మీద లభించిన చిన్నారి తల ఎవరిది? అనే విషయం తెలియరాలేదు. దీనిపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.