తెలంగాణ మంత్రికి ఢిల్లీలో చేదు అనుభవం!
రాత్రి 11 గంటల సమయంలో తెలంగాణ భవన్ కు చేరుకున్న ఆయనకు అక్కడ ప్రొటోకాల్ సిబ్బంది కనిపించలేదు. విమానాశ్రయం నుంచి మంత్రిని తీసుకొచ్చిన వ్యక్తి కారు దిగ్గానే టాటా చెప్పి వెళ్లిపోయాడు.
హైదరాబాద్: ఓ తెలంగాణ మంత్రికి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల పురస్కారం అందుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో తెలంగాణ భవన్ కు చేరుకున్న ఆయనకు అక్కడ ప్రొటోకాల్ సిబ్బంది కనిపించలేదు.
విమానాశ్రయం నుంచి మంత్రిని తీసుకొచ్చిన వ్యక్తి కారు దిగ్గానే టాటా చెప్పి వెళ్లిపోయాడు. దీంతో పాపం ఆ మంత్రి స్వర్ణముఖి బ్లాక్ లో తనకు కేటాయించిన గదికి వెళ్లారు. అక్కడ సహాయకుడిని పిలిచి.. భోజనం తీసుకురమ్మని చెప్పారు.
అయితే సదరు సహాయకుడు.. ''ఇప్పుడిక్కడ భోజనం దొరకదు.. 'గులాటి'( సమీపంలో పేరొందిన భోజనశాల)కి వెళ్లండి..'' అన్నాడు. ఇంతలో ఆంధ్రాభవన్ సిబ్బంది ఒకరు మంత్రిని గుర్తించి.. హుటాహుటిన క్యాంటీన్ నుంచి భోజనం తెచ్చిచ్చాడు.
సదరు మంత్రి హైదరాబాద్ చేరుకున్న తరువాత ఈ విషయమై జీఏడీలో ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణ భవన్లో తెలంగాణ మంత్రినైన తననే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ మంత్రికి 'స్వర్ణముఖి'బ్లాక్ లో గది కేటాయించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా తెలంగాణ మంత్రులకు 'శబరి' బ్లాక్ లో గదులు కేటాయిస్తారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గది సహాయకుడిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.