బాహుబలి 2: 5 షోలకే... తెలంగాణ మంత్రి తలసాని తీవ్ర హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ఫీవర్ పెరుగుతోంది. దీనిని సొమ్ము చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ఫీవర్ పెరుగుతోంది. దీనిని సొమ్ము చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాహుబలి 2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు. తాము కేవలం అయిదు షోలకు మాత్రమే అనుమతిచ్చామన్నారు.
అదనపు షోలు వేయడం, టిక్కెట్ల రేట్లు పెంచడం, కాంబో ఆఫర్స్ టిక్కెట్లు అమ్మడంపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించేది లేదని చెప్పారు.
మరోవైపు, ఏపీలో విజయవాడ బందరు రోడ్డులోని పీవీపీ మాల్ ముందు ప్రేక్షకులు ఆందోళన నిర్వహిసంచారు. టిక్కెట్ల రేట్ల పెంపు, కాంబో ఆఫర్లను వ్యతిరేకిస్తూ వారు నిరసన తెలిపారు.
కాగా, బాహుబలి 2 సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి 2కి చెందిన టిక్కెట్లు ఆన్లైన్లో ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
టిక్కెట్లు పెట్టడమే ఆలస్యం, కొద్ది నిమిషాలకే బుకింగ్ సైట్లలో అవి అయిపోతున్నాయి. అయితే ఆన్లైన్ టిక్కెట్ల పరిస్థితి ఏమో గానీ ఇప్పుడు తాజాగా ఆఫ్లైన్లోనూ బాహుబలి 2 టిక్కెట్లకు అలాంటి స్థితే ఎదురవుతోంది.
పలు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఇప్పటికే బాహుబలి 2 టిక్కెట్లను ఆఫ్లైన్లో విక్రయించడం ప్రారంభించేశాయి. ఈ క్రమంలో ఆ టిక్కెట్లను కొనేందుకు థియేటర్ల వద్ద అభిమానులు గంటల తరబడి వేచి ఉంటున్నారు.