షాకింగ్: హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి
హైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గర్భా నృత్యాలను చూడటానికి హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని భజరంగ్ దళ్ సూచించింది. సందర్శకుల మతం ఏమిటనే విషయాన్ని పరిశీలించడానికి వారి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలను జారీ చేసింది. ఇదే విషయంపై జంటనగరాల్లోని మూడు కమిషన్ కార్యాలయాలకు వినపత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది.
దాండియా ఆటలు, గర్భా నృత్యాల సమయంలో అన్య మతస్తులు హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ కు గురి చేసే అవకాశం ఉన్నందున భజరంగ్ దళ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తారని, అన్యమతస్తులు ఎవరైనా ఉంటే.. ఆ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని భజరంగ్ దళ్ మీడియా కన్వీనర్ కైలాష్ సజ్జన్ పేరు మీద ఓ ప్రకటన విడుదలైనట్లు సమాచారం.
లవ్ జిహాద్ పేరుతో అన్య మతానికి చెందిన యువకులు హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారని, అనంతరం వారిని తీవ్రవాదం వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నారంటూ కొద్దిరోజులుగా భజరంగ్ దళ్ సహా కొన్ని హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, దీనికి అందరూ సహకరించాలని కైలాష్ సజ్జన్ కోరారు. ఇదే విషయంపై భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ కార్యాలయాలకు వినతిపత్రాన్ని అందజేసినట్లు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు పెచ్చరిల్లిపోయాయని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి హిందువు పైనా ఉందని కైలాష్ ఈ సందర్భంగా దాండియా, గర్భా నృత్యాల నిర్వాహకులకు సూచించారని సమాచారం. హిందూ ధర్మం, హైందవ సంస్కృతి పట్ల ఏ మాత్రం విశ్వాసం లేని అన్య మతస్తులు దాండియా, గర్భా వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతారని భజరంగ్ దళ్ ప్రశ్నిస్తోంది. హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసగించడానికి ఇలాంటి వేదికలను వారు వినియోగించుకుంటున్నట్లు తమకు ఇదివరకు ఫిర్యాదులు అందాయని, దీన్ని నిరోధించడానికి ఈ చర్యలను తీసుకుంటున్నట్లు భజరంగ్ దళ్ స్పష్టం చేసినట్లు సమాచారం.