బావ చెప్పినా..రాని బాలయ్య : హుజూర్ నగర్ ప్రచారానికి దూరం : విషయం బోధపడిందా..!
తెలంగాణలో జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటూ టీడీపీ నేతలు ముందుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఒప్పించి బరిలోకి దిగారు. కాంగ్రెస్ మహిళా అభ్యర్ధిని దించటంతో తాము మహిళా అభ్యర్ధినే పోటీలో ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు సైతం సరే అన్నారు. ఇక, ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని..బీజేపీ నేతలు సైతం ధీటుగా ప్రచార కార్య క్రమం రూపొందిస్తున్నారంటూ తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు.
దీంతో..ఆయన టీడీపీ నుండి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న సినీ హీరో..ఎమ్మెల్యే బలక్రిష్ణను హుజూర్ నగర్ ప్రచారానికి పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాలయ్యతోనూ మాట్లాడారు. ఆయన సైతం సరే అన్నారు. కానీ, చివరకు ఆయన ఎన్నికల ప్రచారానికి రాకుండానే సమయం ముగిసిపోయింది. అయితే, నందమూరి సుహాసిని మాత్రం టీడీపీ అభ్యర్ధి తరపున హుజూర నగర్ లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు బాలక్రిష్ణ ప్రచారానికి రాకపోవటం పైన అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి.
ప్రచారానికి రాని బాలయ్య..
పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలతో పార్టీ తరపున ప్రచారానికి బాలక్రిష్ణ వస్తున్నారని చెప్పగానే పార్టీ నేతల్లో కొత్త జోష్ కనిపించింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉన్న పరిస్థితుల్లో హుజూర్ నగర్ లో పోటీ చేయటం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ప్రచారం సాగింది. అయితే, పార్టీ అభ్యర్ధి బరిలో ఉండటంతో అధిష్ఠానం నుండి సహకారం అందించాల్సిన బాధ్యత ఉండటంతో చంద్రబాబు ప్రచారానికి బాలయ్యను పంపాలని నిర్ణయించారు. అయితే, అందుకు ఆయన నేరుగా బాలయ్యతో మాట్లాడి ఒప్పించారు.
ప్రచారానికి వస్తానంటూ బాలయ్య సైతం
తాను ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ప్రచారానికి వస్తానంటూ బాలయ్య సైతం పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. కానీ, ఆయన ప్రచారానికి రాలేదు. దీంతో..టీడీపీ నేతలు నైరాశ్యానికి లోనయ్యారు. ఇప్పటికే పార్టీలో జోష్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో..అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత ఆయన ప్రచారానికి రాకపోవటం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బాలయ్య ప్రచారానికి రాకపోవటం పైన అధికారికంగా స్పష్టమైన సమాచారం పార్టీ నేతల వద్ద లేదు. అయితే, అంతర్గతంగా మాత్రం పార్టీకి అక్కడ ఉన్న బలాబలాలు తెలుసుకున్న తరువాతనే ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది.
ప్రచారంలో సుహాసినీ..అసలు ఎత్తుగడ ఏంటంటే..
హుజూరజ్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో నందమూరి సుహాసిని మాత్రం పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్దికి మద్దతుగా ప్రచారం కొనసాగించారు. అయితే, ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ లో చంద్రబాబు నిర్ణయం మీద అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నా తమ పార్టీ అభ్యర్ది గెలుపు కోసం రావాలని నిర్ణయించారని..అదే విధంగా కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమయంలో చంద్రబాబు మాత్రం ప్రచారానికి రాకుండా బాలయ్యను పంపాలని నిర్ణయించటం వెనుక రాజకీయ కోణం ఉందని చెబుతున్నారు.
బాధ్యులను చేసే ఎత్తుగడ అంటూ
బాలయ్యను ప్రచారంలో పావుగా వాడుకొని..ఫలితాలకు ఆయన్ను బాధ్యులను చేసే ఎత్తుగడ అంటూ కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా..తాము కాంగ్రెస్ తో కలిసి లేమనే సంకేతాలు ఇవ్వటం కోసం మాత్రమే హుజూర్ నగర్ లో టీడీపీ ఒంటరిగా పోటీకి దిగిందని..ఏపీ రాజకీయ సమీకరణాలు..భవిష్యత్ వ్యూహంలో భాగంగానే ఇక్కడ పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నిక సమయంలో టీడీపీ లో జరుగుతన్న పరిణామాల పైన ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది.