కేటీఆర్! ఏపీలో వేలు పెడతావా, రా చూసుకుందాం, తెలంగాణ ప్రజలు తరిమేస్తే: బాలకృష్ణ సవాల్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కు రా చూసుకుందామని ఘాటుగా స్పందించారు. ఆయన కూకట్పల్లిలో జరిగిన సభలో మాట్లాడారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
తెలంగాణలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వేలు పెడతామని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ సవాల్ చేస్తూ.. ఏపీలో వేలు పెడతామనని కేటీఆర్ అన్నారు కదా.. ఏపీకి రా చూసుకుందాం అని సవాల్ చేసారు.
చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్లో రంగంలోకి జనసేన, వైసీపీ!
చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదు
కేటీఆర్ ఆంధ్రాకు కూడా వస్తాడని చెప్పారని, చూద్దామని బాలకృష్ణ అన్నారు. కేటీఆర్కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పారు. రేపు తెలంగాణ ప్రజలు ఓట్లతో సమాధానం చెబుతారని అన్నారు. ఆంధ్రా నుంచి ప్రజలు మోడీని తరిమేశారని చెప్పారు. అదే ఫలితం తెరాసకు ఉంటుందని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తరిమికొడతారన్నారు. నేను ఇటీవల నరేంద్ర మోడీని తిడితే.. హిందీ వచ్చిన వారు రానివారు విమర్శలు చేశారన్నారు.హైదరాబాద్ పైన చంద్రబాబు ముద్రను ఎవరూ చెరిపేయలేరని బాలకృష్ణ చెప్పారు. పోరాడి తెలంగాణను సాధించుకున్న ప్రజలు రాజకీయాల్లోను శాసించే స్థితికి ఎదగాలన్నారు. కేటీఆర్ ఆంధ్రా రాజకీయాల్లోకి వస్తానని చెబితే రావొచ్చునని, తెలంగాణ ప్రజలు తరిమి కొడితే ఆంధ్రకే కాదు ఎక్కడికైనా తరలిపోవాల్సిందే అన్నారు. కేసీఆర్ది లాటరీ, చంద్రబాబుది హిస్టరీ అన్నారు. ఒక్కో ఇటుక పేర్చి హైదరాబాదును చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు.
కేటీఆర్ ఏం చెప్పారంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనమే కనిపిస్తోందని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం వందశాతం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, హైదరాబాద్ నగర పరిధిలోనే పదిహేడు స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. అయితే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకొని, కుట్రలు చేస్తున్నారని కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు సహా తెరాస నేతలు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఏపీలో కూడా పర్యటిస్తామని, అక్కడా రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పారు.
సీమాంధ్రుల ఓట్లు ఉన్నచోట సత్తా చాటుతామని కేటీఆర్
తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా తమ వ్యూహం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్లో బడా నేతలు అందరూ మట్టి కరుస్తారని చెప్పారు. హైదరాబాద్లోనూ అద్భుత ఫలితాలు వస్తాయని, నగరంలో స్థిరపడిన వారంతా తమ వెంటే ఉన్నారని, సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి తదితర చోట్ల కూడా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అయితే ఏపీలో వేలుపెడతామని చెప్పడం సంచలనంగా మారింది.
టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది
తెరాస నేతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు వరుసగా ఇక్కడే పర్యటిస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ సీఎం. దీంతో తెరాస నేతలు ఆయనను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కాంగ్రెస్ నేతలను విమర్శిస్తున్నప్పటికీ చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ట్విట్టర్లోను చంద్రబాబుపై సెటైర్లు
ఆదివారం ట్విట్టర్తో నెటిజన్లతో చేసిన చాట్లోను కేటీఆర్.. చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుది రాజకీయ కమెడియన్ పాత్ర అని, ఆయన ఎన్నికల ప్రచారం వ్యర్థమని, ఓడిపోతామని తెలిసే ఆయన టీడీపీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ నేతలకు వెన్నెముకలు లేకే చంద్రబాబు పంచన చేరారని దుమ్మెత్తిపోశారు. మోసపూరిత రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని, అధికారమే పరమావధిగా భావిస్తారన్నారు. బాహుబలిలో రాజమౌళి, 2.0లో శంకర్ చూపించిన వాటి కన్నా అద్భుతమైన గ్రాఫిక్స్ను చంద్రబాబు అమరావతిలో చూపిస్తున్నారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. మొబైల్ ఫోన్లను, ఇంటర్నెట్ను తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు చివరికి చందమామకు కూడా ఆయన పేరునే పెట్టుకున్నారంటూ కేటీఆర్ సెటైర్ వేశారు.