సుహాసిని నామినేషన్ సందర్భంగా, సోదరుడు హరికృష్ణ మృతిపై నోరు జారిన బాలకృష్ణ
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నోరు జారారు! అభిమానులపై చేయి చేసుకోవడం ద్వారా, తన మాటల ద్వారా ఆయన అప్పుడప్పుడు మీడియాలో నానుతున్నారు. ఇప్పుడు తన అన్నయ్య నందమూరి హరికృష్ణ మృతిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని శనివారం నాడు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట బాలయ్య ఉన్నారు. నామినేషన్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సుహాసినిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఊహించని వ్యాఖ్యలు వచ్చాయి.
అదే స్ఫూర్తితో బరిలో సుహాసిని
ఎన్టీఆర్ ఏ ఆశయాలతో టీడీపీని స్థాపించారో, హరికృష్ణ ఏ స్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించారో, ఆ ఆశయాలతో, ఆ స్ఫూర్తితో నందమూరి సుహాసినిని కూకట్పల్లి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్నామని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారని చెప్పారు. సుహాసినిపై కూడా అదే ఆదరణ చూపించాలని కోరారు. నందమూరి వంశం నుంచి తొలిసారి ఓ మహిళ ఎన్నికల బరిలోకి దిగడం సంతోషకరమైన విషయమని చెప్పారు.
గెలుపు కోసం నేను రోడ్డు షోలు నిర్వహిస్తా
సుహాసినిని కూకట్పల్లి నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు. అదే హరికృష్ణకు నిజమైన నివాళి అన్నారు. తెలంగాణలో మహాకూటమిదే విజయమని చెప్పారు. మహాకూటమి విజయం కోసం బహిరంగ సభలతో పాటు రోడ్డు షోలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం పుట్టింది టీడీపీ అన్నారు. హరికృష్ణ పార్టీ కోసం ఎంతో శ్రమించారన్నారు.
హరికృష్ణ ముక్కుసూటి మనిషి
హరికృష్ణ ముక్కుసూటిగా ఉండేవారని, లాభనష్టాలతో బేరీజు ఆయన అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగే వారని, ఆయనది అలాంటి ఆవేశమని, ఎంత మొండిగట్టమో, అంత వెన్నలా కరిగిపోయే మనసు హరికృష్ణది అని బాలకృష్ణ అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్కు చేదోడువాదోడుగా ఉండేవారని, తండ్రికి తగ్గ తనయుడిగా చైతన్య రథాన్ని నడిపారని చెప్పారు. ఆయన ఎనలేని సేవలు ప్రజలు మరిచిపోలేనివని చెప్పారు. పార్టీతో పాటు హరికృష్ణ కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఇచ్చేవారన్నారు.
సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది
హరికృష్ణ అకాల మరణం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిందని బాలకృష్ణ నోరు జారారు. అనుకోకుండా ఆ మాట మాట్లాడారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఆయన కొనసాగిస్తూ, హరికృష్ణ మృతి నమ్మలేని నిజమని, మా అమ్మాయి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో నిలుస్తున్నారని చెప్పారు. ఆమెను గెలిపించాలన్నారు. టీడీపీకి కార్యకర్తలే పునాది అన్నారు. పార్టీకి వారు, వారికి పార్టీ అండగా నిలిచిందని చెప్పారు. ఆమె గెలుపు హరికృష్ణకు నివాళి అన్నారు. సుహాసిని విజయం కోసం కృషి చేస్తానని టీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు.