తెలంగాణలో బాలక్రిష్ణ టూర్ కన్ఫార్మ్...! ఈ నెల 26న కూకట్ పల్లి లో ప్రచారం చేయనున్న శాతకర్ణి
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకోబోతోంది. కూటమితరుపున అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యకావడంతో కాంగ్రెస్ టీడిపి నేతల ప్రచారం ఆలస్యం అయింది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తవడంతో చాలా మంది అభ్యర్థులకు రూట్ క్లియర్ అయ్యింది. దీంతో బరిలో ఉన్న నాయకులందరూ ప్రచారం పై ద్రుష్టి కేంద్రీకరించారు. కూటమిలో మాత్రం సీనియర్ రాజకీయ నేతలతో పాటు సినిమా తారలతో ప్రచారం చేయాంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా కూకట్ పల్లి నుండి నందమూరి బాలక్రిష్ణ ప్రచారం చేసేందకుకు రంగం సిద్దం చేసారు ముఖ్యనేతలు.
ఊపందుకోనున్న ప్రచారాలు..! రంగంలోకి సినిమా తారలు..!!
నామినేషన్ల ఉపసంహారణ గడువు ముగియడంతో ఎలక్షన్ ప్రచారాన్ని అన్ని పార్టీల నేతలు హోరెత్తిస్తున్నారు.. టీఆర్ఎస్ తరపున అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్..కవితలు ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ ఏకంగా ఆ పార్టీ అగ్రనేతలైనా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీలను రంగంలోకి దింపడంతో ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది. అయితే టి టిడిపికి మాత్రం ప్రచార సారధి ఎవరన్నది క్లారిటీ లేకుండా పోయింది. మొత్తం చంద్రబాబుతో ప్రచారం నిర్వహిస్తే ప్రజల్లో నెగిటివ్ గా మారే అవకాశం ఉందని టి టిడిపి నేతలు భావిస్తున్నారు.. దీంతో ఆ పార్టీ క్రౌడ్ పుల్లర్ గా బాలకృష్ణనే టిడిపి నేతలు నమ్ముకున్నారు. ఈ నెల 26 నుంచి బాలయ్య ప్రచారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
తొలిసారి బాలక్రిష్ణ ప్రచారం..! కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించనున్న శాతకర్ణి..!
ఈ నెల 26 నుంచి తెలంగాణలో సినినటుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. తన అన్న హారికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి నుంచి బాలయ్య ప్రచారం చేయనున్నారు. అయితే బాలకృష్ణ ప్రసంగాలపై టి టిడిపి వర్గాల్లో అసక్తికరమైన చర్చ నడుస్తోంది.. కూటమి ఆభర్థుల తరపున క్యాంపయిన్ చేయనున్న బాలయ్య తన ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేస్తారన్న ఉత్కంఠ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాల మేరకు ముఖ్యమంత్రి ని విమర్శించకుండా ప్రచారాన్ని నెట్టుకొస్తారనే చర్చ కూడా జరుగుతోంది.
కూతురు కు మద్దత్తుగా చిన్నాన్న..! ఈ నెల 26న కూకట్ పల్లి సభలో ప్రసంగించనున్న బాలయ్య..!
అయితే బాలకృష్ణ ప్రచారంపై క్లారిటీ వచ్చింది కానీ.. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎవరు ఔనన్నా ... కాదన్నా... ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ ప్రజాకూటమిగానే సాగనున్నాయి. కూకట్ పల్లి ప్రచారంలో నందమూరి కుటుంబ అడపడుచుకు ఓట్లు వేయమని బాలయ్య ప్రచారం చేయవచ్చు.. కానీ మిగతా నియోజకవర్గాల్లో బాలకృష్ణ ఖచ్చితంగా అధికార టీఆర్ఎస్ పై విమర్శలు చేయకతప్పదు. అయితే అలాంటి పరిస్థితి కనిపించటం లేదు..ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే గులాబీ బాస్ కు ప్రత్యేకమైన అభిమానం వుంది. అందుకే కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ కూడ నందమూరి కుటుంబంపై విమర్శలు చేయలేదు.
బాలయ్య ఎవరిని టార్గెట్ చేస్తారు..! కేసీఆర్ తో సత్సంబందాలు ఉన్న నందమూరి కుటుంబం..!!
దీనికి తోడు గతంలో బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణీ సినిమాకు కేసీఆర్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. అంతే కాకుండా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ కు ప్రత్యేక నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమానికి స్వయంగా కేటీఆరే హాజరయ్యారు. వీటితో పాటు కరుడుగట్టిన తెలంగాణ వాదుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడ హారికృష్ణ అంత్యక్రియలను కేసీఆర్ ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించారు. హారికృష్ణ మరణించినప్పుడు కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడ ఆ కుటుంబాన్ని ఇంటికెళ్లి మరీ పరామర్శించారు. ఇవన్నీ ఒకఎత్తయితే నందమూరి కుటుంబ సభ్యుల అస్తులతో పాటు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటంతో బాలయ్య టీఆర్ఎస్ పై విమర్శలు చేయకపోవచ్చన్న వాదన టిడిపిలో వినిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తన సభల్లో ఘాటైన పదజాలంతో చంద్రబాబు పై విరుచుక పడుతున్నారు. మరీ టీఆర్ఎస్తో పాటు కేసీఆర్ పై బాలకృష్ణ ఎన్నికల స్పీచ్ ఎలా వుంటుందనేది ఇప్పుడు సర్వత్రా అసక్తికరంగా మారింది.