టీడీపీతోనే అభివృద్ధి: తెలంగాణలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
ఖమ్మం: తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనేనని ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
అందుకే! హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్న బాలకృష్ణ: ట్రాక్టర్ నడిపి హల్చల్
బాలకృష్ణకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన జొన్నల గడ్డ నుంచి అభిమానులు, కార్యకర్తలు వందలాది మోటారు సైకిళ్ల ర్యాలీతో బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. బాలకృష్ణ వెంట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, నామానాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు ఉన్నారు.
భారీ ఎన్టీఆర్ విగ్రహం..
ముందుగా మండలంలోని రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం దెందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు
మధిర అంబేడ్కర్ సెంటర్, క్లబ్ కాంప్లెక్స్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధి టీడీపీతోనే..
టీడీపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయడం ఖాయమని ఎల్ రమణ అన్నారు. మహాకూటమి గెలిచే మొదటిస్థానం మధిర నియోజకవర్గమేనని ధీమా వ్యక్తం చేశారు.