అందరివాడ్ని: సీఎం క్యాంప్ ఆఫీసుకు మంత్రి తలసాని కారులో బాలకృష్ణ
ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. తాను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ పన్ను మినహాయింపు విషయమై బాలకృష్ణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అసెంబ్లీలో కలవాలనుకున్నారు.
అయితే, అసెంబ్లీ ఆవరణలో కలిసిన టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, బిజెపి నేత కిషన్ రెడ్డి, తదిరులతో ఆయన సరదాగా ముచ్చటించారు. తాను తెలుగు ప్రజలందరివాడినని అన్నారు. సినిమా బాగా వచ్చిందని తెలిపారు.
కాగా, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సీఎం కేసీఆర్.. బాలకృష్ణను సీఎం క్యాంప్ ఆఫీసుకు ఆహ్వానించడంతో అక్కడికి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కారులో తీసుకెళ్లారు. అక్కడే సీఎం కేసీఆర్ను బాలకృష్ణ కలవనున్నారు. కేసీఆర్ను శాతకర్ణి సినిమా స్పెషల్ షోకు బాలకృష్ణ ఈ సందర్భంగా ఆహ్వానించనున్నారు. అలాగే పన్ను మినహాయింపుపై చర్చించనున్నారు.
ఇది ఇలా ఉండగా, సంక్రాంతి సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా, శ్రియా, హేమామాలిని ప్రధాన పాత్రలను పోషించారు.