రూ.15,60,000: బాలాపూర్ లడ్డు రికార్డు బద్దలు, భారీ ధరకు సొంతం చేసుకున్న తిరుపతిరెడ్డి
తిరుపతిరెడ్డి జూబ్లిహిల్స్ అయ్యప్ప సొసైటీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ వేలం గతేడాది రికార్డును తిరగరాసింది. రూ.15,60,000లకు నాగం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఈ ఏడాది వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది రూ.95వేలు ఎక్కువ పలకడం విశేషం. తిరుపతిరెడ్డి జూబ్లిహిల్స్ అయ్యప్ప సొసైటీకి చెందిన వ్యక్తి అని చెబుతున్నారు.
వేలంలో లడ్డును దక్కించుకోవడానికి సుమారు 15మంది పోటీ పడగా.. చివరికి నాగం తిరుపతిరెడ్డికే లడ్డు దక్కింది. పోటాపోటీగా జరిగిన వేలం ఉత్కంఠను రేపింది. కాగా, ఈ లడ్డును దక్కించుకున్నవారికి అష్ట ఐశ్యర్యాలు, ఆయురారోగ్యాలు సమకూరుతాయని గణేశ్ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
లడ్డూను దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన తిరుపతిరెడ్డి.. 'జై బోలో గణేశ్ మహారాజ్' అంటూ నినాదాలు చేశారు. ఈ లడ్డూను ప్రసాదంగా స్వీకరించడంతో పాటు కొంతమంది రైతులు తమ పొలాల్లోను చల్లుకుంటారు. అలా చల్లడం వల్ల బంగారం పండుతుందనేది వారి నమ్మకం.
ప్రతీ ఏటా లడ్డు వేలంపాట ద్వారా సమకూరే మొత్తాన్ని చుట్టుపక్కల దేవాలయాలకు, గ్రామాభివృద్దికి ఉపయోగిస్తారని బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ చెబుతోంది. గతంలో వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నవారికి సిరిసంపదలు సమకూరడంతో లడ్డూను దక్కించుకోవడానికి ప్రతీ ఏటా పోటీ పెరుగుతూనే ఉంది.