చంపే, చంపించే చరిత్ర: ఊగిపోయిన సుమన్, పనికిమాలినవి: రేవంత్ రెడ్డిపై మాధవరం
హైదరాబాద్: చంపే, చంపించే చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు, యువత చనిపోయారని, వారి చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. మంత్రి కెటిఆర్ సవాల్ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
గ్రేటర్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతిపక్షాలకు గెలిచే సత్తా ఉంటే మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావుకు దమ్ముంటే కేటీఆర్ సవాల్పై స్పందించాలన్నారు.
మెదక్ జిల్లాకే సీఎంగా: కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు.
హైదాబాదులో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సచివాలయానికి వచ్చిన కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు వాగ్ధానం చేసినా నిధులు ఇవ్వడం లేదని, నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపు ఏమైందని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఎందుకు ఆలస్యమైందో చెప్పాలన్నారు.
గోదావరి నీళ్లు కాంగ్రెస్ పార్టీ ఘనతే: షబ్బీర్ అలీ
గోదావరి నీళ్లు హైదరాబాదుకు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. గోదావరి నీళ్లను తాము తెచ్చామని అధికార తెరాస పార్టీ చెప్పుకోవడం సరికాదన్నారు.
రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం
టీడీపీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసదే విజయమన్నారు. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూకట్పల్లి ప్రజలు తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.