చండీయాగంలో అగ్నిప్రమాదంపై నాగఫణీ శర్మ, బాల్క సుమన్: ప్రణబ్ పర్యటన రద్దు
మెదక్: ఆయుత చండీయాగం సంపూర్ణంగా సఫలమైందని మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న చండీయాగం చివరి రోజు స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.
దీనిపై నాగఫణి శర్మ స్పందించారు. భారతీతీర్థ, శంకరాచార్య పర్యవేక్షణలో యాగం సుసంపన్నమైందన్నారు. అభిజిత్ లగ్నంలో పూర్ణాహుతి జరగాల్సి ఉందని, కానీ ముందుగానే శాస్త్రోక్తంగా జరిగిపోయిందన్నారు. నిర్వాహకులు కెసిఆర్ యాగవిభూతి ధరించారన్నారు.
సంప్రోక్షణ ప్రారంభమైంది: బాల్క సుమన్
అయుత చండీయాగం యాగశాల సంప్రోక్షణ ప్రారంభమైందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. పూర్ణాహుతి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం విరామ సమయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
సంప్రోక్షణ అనంతరం అయుత మహాచండీయాగం మహా పూర్ణాహుతి కోసం ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నట్లు సుమన్ చెప్పారు. కాగా, మహాపూర్ణాహుతి కార్యక్రమానికి గవర్నర్ దంపతులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ఈ కార్యక్రమానికి హాజరుకావట్లేదు. భద్రతా కారణాల రీత్యానే ఆయన ఇక్కడికి హాజరు కావడం లేదని తెలుస్తోంది.