లోకేష్! సిటీ ప్రశాంతంగా ఉండొద్దా: సుమన్, గ్రేటర్ బరి నుంచి జగన్ పార్టీ ఔట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిల పైన పెద్దపల్లి టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఇతర ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఉండటం టిడిపికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఏపీలో ఎందుకు చేయడం లేదని ఆయన టిడిపి, బిజెపి నేతలను ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయమై మంత్రి కెటిఆర్ విసిరిన సవాల్ను ప్రతిపక్ష నేతలు ఎందుకు స్వీకరించలేదన్నారు.
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. దిగ్విజయ్ పేరును అపజయ సింగ్గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. కాగా, మంగళవారం నాటి బహిరంగ సభలో బిజెపి, టిడిపి నేతలు కెసిఆర్ పాలన పైన మండిపడిన విషయం తెలిసిందే.
బాబు-కెసిఆర్ తిట్టున్నది మర్చిపోలేదు: దిగ్విజయ్
ఓటుకు నోటు కేసులో కెసిఆర్, చంద్రబాబు మాటలు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు వారిద్దరు ఒకరినొకరు పొగుడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పి మాట మార్చారన్నారు.
తెరాస అధికారం, ఆర్థిక అండదండలతో ప్రలోభ పెడుతోందన్నారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ యూటర్న్ తీసుకోవడంలో నిపుణులు అని ఎద్దేవా చేశారు. సెటిలర్లను నానా మాటలు అన్న కెసిఆర్, కెటిఆర్ ఇప్పుడు ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తున్నారన్నారు.
కెసిఆర్ తీరు కోట శ్రీనివాస్ రావులా: కిషన్ రెడ్డి
తెరాస వన్ సైడ్గా వెళ్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాదుకు లింక్ ఉంటోందన్నారు. హైదరాబాద్ సున్నిత నగరమన్నారు. కెసిఆర్, కెటిఆర్ పుట్టక ముందే హైదరాబాదులో నల్లాల ద్వారా నీళ్లు వస్తున్నాయని, కానీ మేం వచ్చాక వస్తున్నాయని తెరాస అబద్దపు ప్రచారం చేస్తోందన్నారు.
తెరాస చెబుతున్న ఒక్క కార్యక్రమం హైదరాబాదులో అమలు జరగడం లేదన్నారు. హైదరాబాదులో సమస్యల పరిష్కరానికి బిజెపి కృషి చేస్తోందన్నారు. డబుల్ బెడ్ రూంలు ఎవరికి కట్టించారని ప్రశ్నించారు. కెసిఆర్ తీరు.. 'అహనా పెళ్లంట' సినిమాలో కోట శ్రీనివాస రావులా ఉందన్నారు.
హోర్డింగులలో, పోస్టర్లలో డబుల్ బెడ్ రూంలు కనిపిస్తున్నాయని, కానీ ఎవరికి వచ్చిందో చెప్పాలన్నారు. కోట శ్రీనివాస రావు ఆ సినిమాలో చికెన్ చూపిస్తూ తినమని, అనుభూతి పొందమని చెబుతారని, ఇప్పుడు కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కోట శ్రీనివాస రావు పాత్ర పోషిస్తున్నారన్నారు.
గ్రేటర్ బరి నుంచి వైసిపి ఔట్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. తాము గ్రేటర్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలంగాణ వైసిపి ప్రకటించింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయమని, అయితే పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని చెప్పారు. గ్రేటర్ బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బలం లేనందున పోటీ చేయడం లేదా అనే చర్చ సాగుతోంది.