కుర్ కురే కిషన్ రెడ్డి; మోసకారి మోడీ; బీజేపీ దొంగలముఠా వసూళ్ళదందా బయటపెడతాం: బాల్కసుమన్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ పై, బీజేపీ నాయకుల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రపదజాలంతో తిట్టిపోశారు.
ప్రపంచంలోనే మోడీ వంటి మోసగాడు మరొకరు లేరు: బాల్క సుమన్
ప్రపంచంలోనే ప్రధాని మోడీ వంటి మోసగాడు మరొకరు లేరని, జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ దొంగల ముఠాగా మరి వసూళ్ల దందాకు పూనుకున్నారని బాల్క సుమన్ విమర్శించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో చేస్తున్న వసూళ్ల దందాను పార్లమెంట్ వేదికగా బయటపెడతామని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అండ్ కో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ తోపాటు వివిధ కంపెనీల నుంచి బలవంతంగా సాగించిన వసూళ్ల దందా చిట్టా తమ వద్ద ఉందని బాల్క సుమన్ పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి అసమర్థ మంత్రి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడిన బాల్క సుమన్, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కెసిఆర్ ని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదని బాల్క సుమన్ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది కేసీఆర్ కాదని, మోసగాళ్లకే మోసగాడు అయిన మోడీ అని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కురుకురే లు పంచుతున్నారని, అసమర్థ మంత్రిగా, దద్దమ్మ గా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.
కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కార్యాలయాల్లో కనీసం గుమస్తాలు కూడా గుర్తు పట్టరు
ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కార్యాలయాల్లో కనీసం గుమస్తాలు కూడా గుర్తు పట్టరని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పుట్టుకనే మోదీ అపహాస్యం చేస్తే కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు. ఐటీఐఆర్ ను రద్దు చేస్తుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డికి బాల్క సుమన్ ప్రశ్నాస్త్రాలు
తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సింగరేణి నాలుగు బ్లాక్ లను ప్రైవేటుపరం చేస్తుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వడ్లను కొనేది లేదని, తెలంగాణ ప్రజలు నూకలను తినాలని కేంద్రమంత్రి చెబుతుంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు చెప్పాలన్నారు.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ కుల గణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం ఎందుకు ఇప్పటి వరకు ఆమోదించలేదని, కేంద్ర మంత్రిగా నువ్వు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదో ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు బాల్క సుమన్.
మోడీకి దేశ ప్రజలు బై బై చెబుతున్నారు
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తా ప్రజాకంఠక పాలన సాగిస్తున్న మోడీకి దేశ ప్రజలు బై బై చెబుతున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. నిరంకుశ విధానాల మోడీపై తెలంగాణ రాష్ట్రం నుండి తిరుగుబాటు మొదలవుతుందని బాల్క సుమన్ తేల్చిచెప్పారు.
బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టడం పై ఉన్న శ్రద్ధ ప్రజా జీవితాన్ని బాగు చేయడంలో లేదని విమర్శించారు. మోడీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని బాల్క సుమన్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మోడీ నేర్చుకోవాలని బాల్క సుమన్ హితవుపలికారు.