పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి.. రాహుల్ వద్దకు కార్తీకరెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పార్లమెంట్ భద్రత నిబంధనలు ఉల్లంఘించారు. రాజ్యసభ ఎంపీ పాస్పై పార్లమెంట్లోకి వచ్చిన కార్తీకరెడ్డి .. రాహుల్ మీడియా సమావేశానికి వస్తుండగా శాలువా కప్పి స్వాగతం చెప్పారు.
భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ మీడియా సమావేశం వద్దకు వెళ్లారు. దీంతో పార్లమెంట్ భద్రత అధికారులు ఆమెను ప్రశ్నించారు. పార్లమెంట్ హాలులోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో విచారణ జరిపారు.
కాగా, పాస్ నిబంధనలు, వీఐపీ భద్రత చర్యలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పాస్లు ఇచ్చేవారు ఇలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.
కాగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మోడీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోడీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని, అందుకే తనను లోకసభలో మాట్లాడనివ్వడం లేదని ఆయన అన్నారు.