అశ్రునయనాలతో బండారు వైష్ణవ్ అంత్యక్రియలు: పవన్ దిగ్భ్రాంతి, నిర్మలాసీతారామన్ పరామర్శ
హైదరాబాద్: మంగళవారం అర్ధరాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.
విషాదం: గుండెపోటుతో బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి
బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు సైదాబాద్లోని శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య... హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
మనోధైర్యం ఇవ్వాలని..
వైష్ణవ్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయను పరామర్శించారు. పలువరు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. బండారు దత్తాత్రేయ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.
దత్తన్న వెంటే లక్ష్మణ్, చింతల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం రాత్రి సంఘటన జరిగినప్పటి నుంచి తుది అంకం ముగిసే వరకు దత్తాత్రేయతోనే ఉండి వారి కుంటుంబాన్ని ఓదార్చారు.
పవన్ దిగ్భ్రాంతి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ (21) హఠాన్మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
బాధాకరం
ఎంబీబీఎస్ చదువుతూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న అతను చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం చాలా బాధాకరమని ఆవేదన చెందారు. ఈ విషాద వార్త తనను కలచివేసిందని పవన్ చెప్పారు. దత్తాత్రేయకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైష్ణవ్ ఆత్మకు శాంతి చేకూరాలని, పుత్రశోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని దత్తాత్రేయ కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.