కార్మికులు వర్సెస్ ప్రభుత్వం: తెలంగాణ లో అన్నీ బంద్: కొనసాగుతున్న అరెస్ట్ లు..!
తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె ప్రారంభించిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. కోర్టు సూచించినా ఇప్పటి వరకు ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించలేదు. అదే సమయంలో కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించలేదు. అటు ప్రభుత్వం..ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీలు..ప్రజా సంఘాలు..అనేక ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలిచాయి. రెవిన్యూ ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.
దీంతో..జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావం లేదని చాటటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బస్సు డిపోల ముందు ధర్నాలు చేస్తున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం 18 సంఘాలే సమ్మెకు మద్దతు ప్రకటించాయి. హైకోర్టు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని సూచిన చేసింది. అయినా..ఇప్పటి వరకు ఆ విధంగా సంకేతాలు కనిపించటం లేదు.
తెలంగాణలో కొనసాగుతున్న బంద్..
తెలంగాణలో ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె 15వ రోజుకు చేరింది. ర్చలు జరిపి సమస్య పరిష్కరించాలంటూ హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. దాంతో ఇప్పటి వరకూ ధర్నాలు, రాస్తారోకోలు, ధూంధాంలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీలు బంద్ నిర్వహిస్తున్నాయి. ఉదయం నుండే తెలంగాణ వ్యాప్తంగా అనేక డిపోల ముందు కార్మికులు బైఠాయించి బస్సలు బయటకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో..అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో..క్యాబ్ డ్రైవర్ల సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ప్రకటించటంతో..ప్రభుత్వం తాత్కాలిక పద్దతిన నియమించిన సిబ్బందితో ఎలాగైనా బస్సులను నడపాలని ప్రయత్నిస్తోంది. పోలీసుల పహారా మధ్య బస్సులు తిప్పే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దీంతో..అనేక చోట్ల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 18 సంఘాలు..
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలతో పాటుగా వివిధ రంగాలకు చెందిన 18 సంఘాలు మద్దతు ప్రకటించాయి. అందులో కీలక మైన టీఎన్జీవోల తో సహా... అడ్వొకేట్ జేఏసీ..విద్యార్థి సంఘాలు.. పీఆర్టీయూ.. జాక్టో.. తెలంగాణ ఉద్యోగుల సంఘం.. వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘాలు.. టీచర్ల సంఘాలు .. క్యాబ్ డ్రైవర్ల సంఘం.. రెవెన్యూ సంఘాలు .. డిప్యూటీ కలెక్టర్ల సంఘం .. తహసీల్దార్ల అసోసియేషన్.. వీఆర్వో, వీఆర్ఏల సంఘాలు..రేషన్ డీలర్ల సంఘం .. ఆల్ ఇండియా డాక్టర్ల యూనియన్ .. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ .. పద్నాలుగు బీసీ సంఘాలు .. మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ లు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి.
కాగా, ఉద్యోగ, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కార్మికులు విధులకు హాజరై... భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు. సమ్మెకు మద్దతుగా రెవెన్యూ జేఏసీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది.
కొనసాగుతున్న అరెస్ట్ లు...
ఎలాగైనా బంద్ ప్రభావం లేదనే చెప్పే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల వద్ద ఆందోళనలకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కోర్టు సూచన చేసినా ప్రభుత్వం చర్చలకు పిలవకపోటం పైన కార్మిక సంఘాలు ఆగ్రహంతో పాటుగా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో బంద్కు సహకరించాలని వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆర్టీసీ కార్మికులు కోరారు. దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలు..అన్ని సంస్థల నుండి సమ్మెకు మద్దతు లభిస్తోంది. ఇక, సోమవారం నుండి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. సమ్మె కొనసాగితే..విద్యార్ధుల పరిస్థితి ఏంటనే ఆందోళన పేరంట్స్ లో కనిపిస్తోంది. ఈ రోజు బంద్ నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది చూడాలి. ఆర్టీసీ అధికారుల నుండి చర్చల దిశగా పిలుపు ఏమైనా వస్తుందా అనే ఆసక్తి కూడా నెలకొని ఉంది.