టీ సర్కార్ కు కార్మికుల సత్తా ఏంటో చూపించాం..! బంద్ లో పాల్గొన్న నేతలకు కృతజ్ఞతలు: అశ్వత్థామ రెడ్డి.
హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపుకు తెలంగాణ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు స్వచ్చందంగా మద్దత్తు తెలిపి విజయవంతం చేసారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందని, బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పలు రాజకీయ నేతలు బంద్ లో పాల్గొని అరెస్టులకు గురి కావడం శోచనీయన్నారు. ఐనప్పటికి కార్మికుల సత్తా ఏంటో భుత్వానికి ప్రత్యక్షంగా చూపించగలిగామని అన్నారు.
ఇంత ప్రజ వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేక పోవడం దారుణమన్నారు అశ్వధ్దామ రెడ్ది. ప్రజాస్వామ్యాయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా సమ్మెపై సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వెనక్కి తగ్గేది లేదన్నారు. అబిడ్స్ జీపీఓ దగ్గర అరెస్టైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరుల అరెస్ట్ అయ్యారు. వీరిని గోషామహల్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, హారీష్ రావు, ఈటల రాజేందర్ కు పదవులు శాశ్వతం కాదన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారిని ద్రోహులని అన్నారు, ఇప్పుడు ఈటల, హరీష్ రావు లు కూడా ద్రోహులేనన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు ముఖ్యమా? పదవులు ముఖ్యమా?.
తెలంగాణలో జరుగుతున్న ప్రతి అప్రజాస్వామిక విషయాన్ని కేంద్రానికి తెలుపుతున్నామన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ అయినా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు చీమ కుట్టునట్టు లేదన్నారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని అన్నారు. ఇది ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదు, సకల జనుల సమ్మె అని ఆయన హెచ్చరించారు.