ప్లాన్ ప్రకారమే... ఎంఐఎం గూండాల దాడి యత్నం... బండి సంజయ్ ఆరోపణలు...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది కాబట్టే... టీఆర్ఎస్-ఎంఐఎం నాయకులు మద్యం,నోట్ల పంపిణీతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.బీజేపీని బూచిగా చూపెట్టి కేసీఆర్,ఓవైసీ హైదరాబాద్లో విధ్వంసం సృష్టించి ఎన్నికలను వాయిదా వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం గూండాలు తన కారుపై దాడికి యత్నించారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
ఎంఐఎం గూండాలు దాడి చేశారని...
సోమవారం(నవంబర్ 30) సాయంత్రం కొంతమంది పాత్రికేయ మిత్రులతో కలిసి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్లో టీ తాగేందుకు వెళ్లినట్లు బండి సంజయ్ చెప్పారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా ఎంఐఎం గూండాలు తన కారుపై దాడికి యత్నించినట్లు ఆరోపించారు. ఈలోగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి అక్కడికి వచ్చారని.. అప్పటికే అక్కడ ఉన్న ఎంఐఎం గూండాలతో కలిసి తన కారును అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసులు వారించినా వాళ్లు వినిపించుకోలేదన్నారు. ఎట్టకేలకు పోలీసులు,తమ కార్యకర్తలు తనను సురక్షితంగా అక్కడినుంచి పంపించారని చెప్పారు.
ప్లాన్ ప్రకారమే చేశారని ఆరోపణలు...
సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే.. గన్మెన్లు లేకపోయి ఉంటే ఏం జరిగేదో ఆలోచించాలన్నారు. ప్లాన్ ప్రకారమే తనపై హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. తాను అక్కడినుంచి వెళ్లిపోయాక అక్కడే ఉన్న తమ పార్టీ కారుపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి చేయడమే కాకుండా తమపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి టీఆర్ఎస్,ఎంఐఎం మద్యం,నోట్ల పంపిణీ చేపడుతున్నాయని... దానిపై బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రివర్స్లో తమవాళ్ల పైనే కేసులు పెడుతున్నారన్నారు.
ఫేక్ ట్వీట్తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని...
ముఖ్యమంత్రి కేసీఆర్కు భయం పట్టుకుందని... చంద్రబాబు,రాజశేఖర్ రెడ్డిలను తాను తిట్టినట్లు తప్పుడు ట్వీట్ను తన పేరుతో ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆంధ్రా,రాయలసీమ ఓటర్లు కేసీఆర్ అసలు స్వరూపాన్ని ఎప్పుడో గుర్తించారన్నారు. వాళ్లంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే ఫేక్ ట్వీట్ను తెరపైకి తెచ్చారన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ట్వీట్ను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.
దీక్షకు దిగనున్న లక్ష్మణ్...
టీఆర్ఎస్ దాడులు,ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం(డిసెంబర్ 1) దీక్షకు దిగనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని,కారుపై దాడి చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దాడిని అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఖండించారు.