కేసీఆర్ యూటర్న్ అంటూ బండి సంజయ్ ఫైర్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ దీక్ష
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగివుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సాగు చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ అయోమయం సృష్టిస్తున్నారు
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కొంత అయోమయం సృష్టించేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. రైతు వేదికలను కొనుగోలు చేంద్రాలుగా మార్చాలన్నారు.
7500 కోట్ల నష్టానికి కారణమేంటి కేసీఆర్: బండి సంజయ్
పంట కొనుగోళ్లతో రూ. 7500 కోట్ల నష్టం చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు గల కారణాలను కూడా వెల్లడించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంచుకోవడానికి ముఖ్యమంత్రికి చాలా సమయం పట్టిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఇలా ఎందుకు? ఢిల్లీలో ఏం జరిగింది?: జగ్గారెడ్డి
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కేసీఆర్ విధానాలపై మండిపడ్డారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ఆ విధానాలను సమర్థిస్తున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న కేసీఆర్.. రైతుల దీక్ష దగ్గరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం ఒప్పందాలు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు భారాన్ని ఎందుకు భరించమంటున్నారని నిలదీశారు. ఇక ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. కరోనా దెబ్బతో ప్రజలు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టలేరన్నారు. నామమాత్రపు ఫీజుతో ప్లాట్లను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇలావుంటే, పీసీసీ చీఫ్ అంశంపై మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఎవరికి బాధ్యతలు అప్పగించినా.. కలిసి పనిచేస్తామని అన్నారు జగ్గారెడ్డి.
Recommended Video
ఎల్ఆర్ఎస్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ దీక్ష
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంపై కేసీఆర్ సంక్రాంతి పండగలోపు నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. కేంద్రం తెచ్చిన చట్టాలను కేసీఆర్ ఇప్పుడెందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అనగానే భయం పట్టుకుందా? అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం రూ. 8వేల కోట్లు ఖర్చుపెట్టలేవా? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ తెచ్చిన కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.