నంబర్ వన్ తెలంగాణాద్రోహి కేసీఆర్; త్వరలో ఆ స్కాములన్నీ.. కౌంట్డౌన్ స్టార్ట్: బండి సంజయ్
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. బండి సంజయ్ పై జరిగిన దాడిని టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసులు కలిసి చేసిన దాడిలా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు పరిపాలించడానికి ఎన్నుకున్నారా లేక గుండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా ? అంటూ బండి సంజయ్ ఘాటుగా ప్రశ్నించారు. ఈరోజు నల్గొండ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీ నేతల గుండాయిజం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీపీకి కాల్ చేసినా, డీజీపీకి కాల్ చేసినా స్పందన లేదు
నువ్వు అసలు గుండావా, ముఖ్యమంత్రివా అని సీఎం కేసీఆర్ ని ప్రశ్నించిన బండి సంజయ్ ఎంపీ అరవింద్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నాడు, నీ ఫామ్ హౌస్ కి రావట్లేదు అంటూ విమర్శించారు. యువ మోర్చా కార్యకర్త పై కత్తులతో దాడి చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చెప్పడానికి సిపి కి కాల్ చేస్తే స్పందన లేదు. సిపి కార్యాలయంలో ఒక్కరు కూడా లేరా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర డిజిపి ఎవరు ఫోన్ చేసినా తీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ కి తెలిసే జిల్లాలలో దాడులు జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు.

సీఎం కేసీఆర్ వల్లే శాంతి భద్రతలకు విఘాతం
తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతున్నా డీజీపీకి పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని పేర్కొన్న బండి సంజయ్, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి ఘటనను కేంద్ర నాయకత్వానికి తెలియజేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇకనైనా తన ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు బండి సంజయ్. ఖమ్మంలో ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న సాగర్ కి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం అని పేర్కొన్న బండి సంజయ్ ముఖ్యమంత్రి తప్ప ప్రతి ఒక్కరు ప్రగాఢ సానుభూతి తెలపాలని పేర్కొన్నారు.

నాడు తెలంగాణా ఉద్యమం కోసం .,. నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు
ఆనాడు తెలంగాణ ప్రజలు ఉద్యమం కోసం ఆత్మహత్య లు చేసుకుంటే ఈనాడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ లో ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలంగాణ ఎవరికోసం వచ్చిందో అర్థం కావడంలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. బిజెపి 317 జీవో ను సవరించాలని డిమాండ్ చేస్తూ...త్వరలోనే వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర నాయకత్వంతో ఉద్యోగులను మాట్లాడిస్తామని, విద్యార్థులకు వచ్చిన బీజేపీ నిలబడి పోరాటం చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్
ఏడేండ్ల నుండి ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు..ఏం చేస్తున్నాడో అర్థం కావడంలేదని సీఎం కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జిల్లాకో రూల్ ఇచ్చాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఆయన డిప్రెషన్ కి లోనవుతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంటే తమకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపిస్తుంటే, సీఎం కేసీఆర్ కు మాత్రం నిజాం నవాబు కనిపిస్తున్నాడని విమర్శించారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ బండి సంజయ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

కేంద్ర మంత్రిగా కేసీఆర్ అవినీతి .. అన్నీ బయటకు తీస్తాం
ఉద్యమ కాలంలో అన్ని దొంగ దీక్షలు చేశాడని, పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వోటింగ్ కే హాజరుకాలేదని గుర్తు చేశారు బండి సంజయ్. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అత్యంత అవినీతి మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అంటూ విమర్శించారు. ఈ ఎస్ ఐ స్కామ్ లాంటివి ఎన్నో వున్నాయి అవన్నీ బయటికి తీస్తాం అని హెచ్చరించారు బండి సంజయ్. ఎలుగుబంటి సూర్యనారాయణ ఎపిసోడు ఆ తరువాత జరిగిన అవినీతి అన్ని బయటపెడతాం అంటూ బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ బయట పడతాయనే మళ్ళీ తెలంగాణ వాదం అంటూ కొత్త డ్రామాలు ఆడుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నావు అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

కేంద్రం నిధులతోనే తెలంగాణాలో అభివృద్ధి.. వేల కోట్లు ఎవరికి ఇచ్చావ్
రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప కెసిఆర్ ఒక్క పైసా ఇవ్వట్లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. వరంగల్ లో గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తా అన్నావ్...ఇంతవరకు దాని ఊసే లేదు అని పేర్కొన్న బండి సంజయ్ కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారో చెప్పమంటూ మండిపడ్డారు. నిజాయితీగా ఉండి ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి.. అవన్నీ పక్కన పెట్టి కేంద్రం పై అపవాదులు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కేంద్రం ద్రోహం చేస్తుందని ఇప్పుడే గుర్తొచ్చిందా?
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తుందన్న విషయం గతంలో ఎందుకు గుర్తుకు రాలేదు...ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందో చెప్పాలన్నారు బండి సంజయ్. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి, తాను చేసిన తప్పులను కప్పి పుచుకోడానికి కేంద్రంపై అపవాదులు వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదని పేర్కొన్న బండి సంజయ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సమస్యల పై అఖిలపక్షం సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ లో ఐఏఎస్ అధికారులను పెట్టుకుని చాకిరి చేయించుకుంటున్నారని, రాష్ట్రంలో ఆత్మాభిమానం ఉన్న ఐఏఎస్ లు పని చేయలేకపోతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు.