నాతో ఫొటో దిగితే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా? ఆ 120 కోట్లు ఏం చేశారు కేసీఆర్?: బండి సంజయ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూసార పరీక్ష లేకుండానే సన్న రకాలు వేయమని కేసీఆర్ చెప్పారని తెలిపారు.
ఆ 120 కోట్లు ఏం చేశారు కేసీఆర్?: బండి సంజయ్ హెచ్చరిక
గ్రామ గ్రామాన భూసార పరీక్షలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 120 కోట్ల నిధుల్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఆ రూ. 120 కోట్లను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 30 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు వేశారని, వాటి కొనుగోలు సక్రమంగా కొనసాగడం లేదన్నారు. సన్న రకాలకు రూ. 2500 మద్దతు ధర కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఉద్యమం చేస్తామని, యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని సంజయ్ హెచ్చరించారు.
రైతులకు మేలు చేసే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
కేంద్ర వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పాలంటూ పలు ప్రశ్నలు సంధించారు సంజయ్. రైతు పండించిన పంట తనకు తానే ధర నిర్ణయించడం తప్పా? రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛా మార్కెట్ కల్పించడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.
నాతో ఫొటో దిగిన ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా? అంటూ బండి
సీఎం కేసీఆర్ తనకు కొమ్ముగాసే వాళ్లకు మాత్రమే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. ఓ టీఎన్జీవో నేత బామ్మర్దికి అర్హత లేకున్నా ప్రమోషన్ ఇప్పించారన్నారు. తనతో ఫొటో దిగినందుకు ఖమ్మంలో ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
బీజేపీలో కొనసాగుతున్న చేరికలు
ఇది ఇలావుండగా, నిర్మల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండల జడ్పీటీసీ జానకీ రమేశ్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్తో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు