కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకూ అంతే: హిందువులను కించపరుస్తున్నారంటూ బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో జరుగుతున్న తాజా ఘటనలపై స్పందిస్తూ కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నా.. న్యాయం చేసేందుకు కోర్టులున్నాయని అన్నారు.
బీజేపీ నేతలకు బెయిల్పై సంజయ్ హర్షం
రామమందిరం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ లతోపాటు మరో 42 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వీరందరికి కోర్టులో బుధవారం బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలో హర్షం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు అంతే..
దేశం, ధర్మం కోసం పోరాటాలు, అరెస్టులు బీజేపీకి కొత్తేంకాదు. హిందుత్వాన్ని, హిందువులను కించపరిచేలా మాట్లాడటం, అవమానించే వ్యాఖ్యలు చేయడం సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పరిపాటిగా మారింది. వరంగల్, పరకాలలో బీజేపీ నాయకులపై దాడులు, కార్యాలయాలు దగ్ధం చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని అనిపిస్తోంది' అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ గూండాలను ఎందుకు జైల్లో పెట్టలేదు?: బండి
కేసీఆర్ అహంకారపూరిత, హిందూ వ్యతిరేక విధానాలను జనం గమనిస్తున్నారు. రాముడిని అనుక్షణం నిందించే మీకు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువుల స్వాభిమానానికి చిహ్నం. ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ రామయ్యను కించపరిచారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలను మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. బిజెపి నాయకులపై, ఇళ్లపై, కార్యాలయాలపై దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను కూడా అరెస్ట్ చేసి జైళ్లలో ఎందుకు పెట్టలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.