బీఆర్ఎస్తో దేశానికి ఏం సందేశం ఇస్తారు! మెట్రో అందుకేగా.: బండి సంజయ్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. విద్యుత్ రంగంలో హైదరాబాద్ను పవర్ ఐలాండ్ గా మార్చామనడంపై విమర్శలు గుప్పించారు. చినుకుపడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్గా మారిందనడం హాస్యాస్పదమన్నారు.
బీఆర్ఎస్తో దేశానికి ఏం చెబుతారంటూ బండి సంజయ్ ప్రశ్న
ప్రజా సంగ్రామయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాట్లాడారు. బీఆర్ఎస్ పెట్టిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లు చేయడమేనా? తెలంగాణ మోడల్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా.. అనేది దేశానికి చాటిచెప్పడమేనా? తెలంగాణ మోడల్ అంటే అని నిలదీశారు.
కేసీఆర్ బీఆర్ఎస్ నాటకాలు అందుకేనంటూ బండి సంజయ్
బీఆర్ఎస్ సమావేశంలో ఒక్కరి మొహంలో కూడా నవ్వులేదు. పార్టీ ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పార్టీ పేరు జెండా నుంచి తెలంగాణ పేరు తొలగించారని.. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారన్నారు. బీఆర్ఎస్ కాదు.. అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. లిక్కర్ స్కాం పక్కకు పోయేందుకే బీఆర్ఎస్ అంటూ నాటకాలు అని మండిపడ్డారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేటీఆర్ ప్రయత్నమన్నారు. రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ రగిల్చాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు బండి సంజయ్.
తెలంగాణకు పీడపోయిందంటూ బండి సంజయ్
టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని.. పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బండి సంజయ్ విమర్శించారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారని ఆరోపించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చింది..? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో కేసీఆర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
వారి భూముల ధరలను పెంచుకునేందుకే మెట్రో బాట: బండి
ముఖ్యమంత్రి బండారం బయట పెడతానని..కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్.. ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని బండి సంజయ్ అన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. మెట్రో పక్కన తన భూములకు ధరలు రావాలని..కేసీఆర్ మళ్లీ మెట్రో కావాలని అంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ బండి సంజయ్
తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్, కమలం వికసించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంద బండి సంజయ్ తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత మోడీదని అన్నారు. అలాగే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపిస్తారా.. తామే తెరిపించాలా..? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంజయ్ సవాల్ చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు బండి సంజయ్.