వాస్తవాలను దాస్తున్నారు.. అతని మరణాన్ని నివేదికల్లో ఎందుకు చూపించలేదు : బండి సంజయ్
తెలంగాణలో కరోనా వైద్య పరీక్షలపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్కి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. టెస్టులు సరిగా చేయడం లేదని సంజయ్ ఆరోపిస్తుంటే... గుడ్డెద్దు చేలో పడ్డట్టు టెస్టులు చేయరని ఈటెల కౌంటర్ ఇచ్చారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే తెలంగాణలో టెస్టులు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలు సైతం ప్రభుత్వ చర్యలను ప్రశంసించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మరోసారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు,విమర్శలు చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు మరో ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ను పంపించాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని అందులో పేర్కొన్నారు.
Recommended Video
సంజయ్ ఏమన్నారు..
'తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కరోనా వైద్య పరీక్షలు చేయడం లేదు. అలాగే వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదు. పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిన గాంధీ ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి మాకు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఆస్పత్రిలో సరిపడా వాష్రూమ్లు లేకపోవడం, ఉన్నవాటిలోనూ చాలా సమస్యలు ఉండటం వంటి ఫిర్యాదులు ఉన్నాయి.' అని లేఖలో సంజయ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న సంజయ్..
'చాలావరకు గదులు, వార్డులకు ప్రత్యేక బాత్రూమ్లు సౌకర్యం లేదు. ఐసీఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ను ఎక్కడా పాటించడం లేదు.ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత కొరవడింది. నిర్దేశించిన ప్రమాణాల కంటే అది తక్కవ స్థాయిలో ఉంది. శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది సరిపడే సంఖ్యలో లేరు. రోగులను గుర్తించడంలో, పరీక్షించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది.'అని సంజయ్ చెప్పుకొచ్చారు.
నివేదికల్లో అతని మరణాన్ని ఎందుకు చూపించలేదు..
'సీఎస్ శాస్త్రి(80) అనే వృద్దుడు కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నెగటివ్గా నిర్దారించారు. కానీ నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 26న కరోనాతో అతను మృతి చెందాడు. అయితే ఏప్రిల్ 26, 27 మరియు 28 నివేదికలలో ప్రభుత్వం అతని మరణాన్ని చూపించలేదు. ఆయన 26వ తేదీన కరోనాతో మరణించాడని డెత్ రిపోర్ట్ ఉంది. ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుంది.' అని సంజయ్ ఆరోపించారు.
వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారు..
'మేము బలంగా నమ్ముతున్నాం.. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, ఇది ఫిర్యాదులు చేసే సమయం కాదని మాకు తెలుసు. కానీ కేసుల సంఖ్యను,మరణాలను ఎందుకు తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మీ దృష్టికి తీసుకురావటం మా నైతిక బాధ్యతగా భావిస్తున్నాం. అకస్మాత్తుగా వచ్చిన ఈ విపత్కర పరిస్థితులను డీల్ చేయడం ఏ ప్రభుత్వానికైనా కష్టమని తెలుసు. కానీ వాస్తవాలను దాచడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం హర్షణీయం కాదు.' అని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.