ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు రెడీ అయిన బండి సంజయ్.. అక్టోబర్ 15నుండి షురూ!!
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతో, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించి ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు బండి సంజయ్. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల ఆదరణ కోసం ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి సాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర సాగించిన బండి సంజయ్ తాజాగా ఐదో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు.
ఐదో విడత పాదయాత్రకు రెడీ అయిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని గద్దె దించాలనే లక్ష్యంతో తెలంగాణ బిజెపి రథసారథి గా బండి సంజయ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాడు. ఇందులో భాగంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లిబీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ ఇప్పటికే గ్రామగ్రామాన ప్రజా గోస- బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడుమళ్ళీ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టనున్నారు.
అక్టోబర్ 15 నుండి ఐదో విడత పాదయాత్ర షురూ.. బైంసా నుండి కరీంనగర్ వరకు
ఇక ఐదో విడత పాదయాత్రకు రెడీ అయిన బండి సంజయ్ అక్టోబర్ 15వ తేదీ నుండి పాదయాత్రను కొనసాగించనున్నారని ఒక ప్రకటన వెలువడింది. అక్టోబర్ 15 నుండి కొనసాగించనున్న ఐదో విడత పాదయాత్ర బైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుందని బిజెపి శ్రేణులు వెల్లడించాయి. బాసర అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి బైంసా నుండి పాదయాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు.
బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర.. బీజేపీ శ్రేణుల్లో జోష్
ఇప్పటికే బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఐదో విడత పాదయాత్రకు బండి సంజయ్ రెడీ అవడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది.