సీన్లోకి జేజమ్మ: కేసీఆర్తో చర్చకు సంజయ్ రెడీ.. హరీశ్ సవాల్కు అరుణ కౌంటర్
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బండి సంజయ్కు మంత్రి హరీశ్ రావు సవాల్ విసరగా.. దానికి జేజమ్మ డీకే అరుణ స్పందించారు. కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్తో చర్చకు బండి సంజయ్ సిద్ధమని స్పష్టంచేశారు. ఊరికే అరవడంతో ప్రయోజనం ఏమీ లేదన్నారు. హరీశ్ రావు తన పేరును అరిచే రావుగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
ఆర్థికమంత్రికి స్పష్టత లేదా..?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులపై ఆర్థికమంత్రి హరీశ్ రావుకు స్పష్టత లేదని డీకే అరుణ అన్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి పంపింది హరీశ్ రావు కాదా అని ఆరోపించారు. అక్కడ టికెట్ ఇప్పించింది హరీశ్రావ్ అన్నారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లతోపాటు దుబ్బాకలో కూడా పాగా వేయాలని అనుకుంటున్నారా అని అడిగారు.
డబ్బుతో గెలవాలని..
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం, డబ్బుతో గెలవాలని చూస్తోందని అరుణ ఆరోపించారు. ఓటమి భయంతో హరీశ్ రావు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. తగిన బుద్ది తప్పకుండా చెబుతామని తేల్చిచెప్పారు.
హరీశ్ రావు సవాల్..
వృద్దాప్య, బీడీ కార్మికుల పెన్షన్, కేసీఆర్ కిట్పై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు సవాల్ విసిరారు. నిజంగా బీడీ కార్మికులకు, కేసీఆర్ కిట్కు కేంద్రం నిధులు ఇస్తే తాను ఆర్థికమంత్రి పదవీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని చెప్పారు. అదీ అబద్దమైతే దుబ్బాక పాత బస్తాండ్ ముక్కునేలకు రాస్తావా అని సవాల్ విసిరారు. ఎంపీ పదవీకి రాజీనామా చేయాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీకి కూడా రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. నిన్న హరీశ్ రావు చాలెంజ్ చేయగా.. ఇవాళ డీకే అరుణ స్పందించారు.